చిన్నారి మృతి మిస్టరీ: ఆందోళన, ఉద్రిక్తం (పిక్చర్స్)
హైదరాబాద్: అనుమానాస్పద స్థితిలో ఒక విద్యార్థి పాఠశాలలోని స్విమ్మింగ్ పూల్ వద్దమృతి చెంది ఉండటంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ విషాద సంఘటన అల్వాల్ మచ్చబొల్లారం పరిధిలోని సూర్యనగర్లో గురువారం జరిగింది. పాఠశాల వెనక భాగంలోని స్విమ్మింగ్ పూల్ వద్ద విద్యార్థి శవం పడి ఉండడంతో అనుమానాలు కలుగుతున్నాయి
సూర్యనగర్ నివాసి కృష్ణకాంత్, రాధ కుమారుడు సూర్య (9) భాష్యం పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నాడు. గురువారం పాఠశాల బంద్ కావటంతో సూర్య సైకిల్ తీసుకుని పాఠశాలలో స్నేహితులతో కల్సి ఆడుకుంటానని తల్లి రాధకు చెప్పి వెళ్లాడు. ఉదయం 11 గంటలకు వెళ్లి ఒంటిగంట వరకు కూడా తిరిగి రాకపోవటంతో తల్లి రాధ వెళ్లి సూర్య గురించి పాఠశాల వద్ద ఉన్న వాచ్మెన్ను అడిగింది.
సూర్య సైకిల్ ఇక్కడే ఉందని, సైకిల్ ఇక్కడ పెట్టి ఎక్కడికో వెళ్లి ఉంటాడని సమాధానం చెప్పాడు. చుట్టుపక్కల వారిని విచారించినా బాలుడి ఆచూకీ దొరకలేదు. 5 గంటలకు పాఠశాల వద్దకు వెళ్లి సూర్య గురించి విచారించినా పాఠశాల యాజమాన్యం అదే సమాధానం చెప్పింది. దీంతో విద్యార్థి సూర్య తండ్రి కృష్ణకాంత్కు అనుమానం వచ్చి పాఠశాలలోకి వెళ్లి కలియతిరిగాడు. అతనికి తమ కుమారుడి శవం కనిపించింది.
స్విమ్మింగ్ పూల్ ఇదే
పాఠశాల వెనుక భాగంలో స్విమ్మింగ్ పూల్ పక్కన సూర్య మృతదేహం పడి ఉంది. దీంతో ఒక్కసారిగా బిగ్గరగా రోదించడంతో పాఠశాల బయట ఉన్న వారి బంధువులు, స్థానికులు ఒక్కసారిగా పాఠశాల యాజమాన్యంపై దాడి చేశారు.
పోలీసుల రంగప్రవేశం
బంధువులు, స్థానికులు ఆందోళనకు దిగిన సమాచారం అందుకున్న అల్వాల్ సిఐ హరికృష్ణ హుటాహుటిన సిబ్బందితో పాఠశాలకు వెళ్లి పరిస్థితి అదుపు చేశారు.
గోడుగోడున తల్లిదండ్రులు
తన కుమారుడు సూర్య స్విమ్మింగ్ పూల్ వద్ద విగతజీవుడై పడి ఉండడంతో తల్లిదండ్రులు గోడుగోడున విలపించారు.
ధర్నాకు దిగారు..
ఎలా మృతి చెందాడనే అంశం మిస్టరీగా ఉండటంతో విద్యార్థి సూర్య మృతదేహాంతో పాఠశాల ముందు బంధువులు, స్థానికులు ధర్నాకు దిగారు.
మృతదేహంతో ఇలా..
పాఠశాల స్విమ్మింగ్ పూల్ వద్ద తమ కుమారుడు సూర్య విగతజీవుడై పడి ఉండడాన్ని తండ్రి గుర్తించాడు. ఇలా చేతుల మీద మోశాడు.
నష్టపరిహారానికి అంగీకారం
ఆందోళనను చల్లార్చడానికి భాష్యం పాఠశాల రీజనల్ కో-ఆర్డినేటర్ చైతన్యతో స్థానిక తెలుగుదేశం, బిజెపి, నాయకులు, స్థానికులు చర్చించి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
శోకతప్తులైన కుటుంబ సభ్యులు
సూర్య మృతి చెందడంతో అతని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు బోరుబోరున విలపించారు. బంధువులు, స్థానికులు ఆందోళనకు దిగారు.
భారీ బందోబస్తు
రాత్రి చర్చల్లో పురోగతి రావటంతో పాఠశాల యాజమాన్యం 7 లక్షల నగదు చెల్లించటానికి అంగీకరించింది. దీంతో ధర్నాను ఉపసంవరించుకున్నారు. అల్వాల్ సిఐ హరికృష్ణ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.