పాలమూరులో షర్మిలకు ఝలక్, కొట్టుకున్నారు!
మహబూబ్ నగర్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల పరామర్శ యాత్రను విద్యార్థి ఐక్యకార్యాచరణ సమితి సంఘం బుధవారం అడ్డుకుంది. షర్మిల యాత్ర మహబూబ్ నగర్ జిల్లాలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.
జిల్లాలోని వనపర్తి మండలం చిట్యాలలో విద్యార్థి నేతలు ఆమె యాత్రను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. విద్యార్థుల పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. పోలీసులు జోక్యం చేసుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు. షర్మిల యాత్ర బుధవారం మూడో రోజు.
షర్మిల బుధవారం నాడు గట్టు మండలం నందిన్నె గ్రామానికి చెందిన యర్ర నర్సింహా రెడ్డి కుటుంబాన్ని, కొల్లాపూర్ మండలం పెంట్లవెల్లికి చెందిన వూరి లచ్చమ్మ కుటుంబాన్ని, కొత్తకోట మండలం రాయినిపేట గ్రామానికి చెందిన దస్తగిరిమ్మ కుటుంబాన్ని, వనపర్తి మండలం చిట్యాలలోని గొల్ల మణెమ్మ కుటుంబాన్ని పరామర్శిస్తారు.
షర్మిల పరామర్శ యాత్ర పానగల్ మండలం అన్నారం, దవాజిపల్లి స్టేజి, అంజనగిరి, మెట్పల్లి మీదుగా వనపర్తి నుండి చిట్యాలకు చేరుకుంటుంది. అక్కడ మణెమ్మ భర్త గొల్ల బుచ్చన్న ఇంటికి వెళ్లి వారిని పరామర్శిస్తారు.
కాగా, షర్మిల చేపట్టిన పరామర్శ యాత్ర జిల్లాలో మంగళవారం ఉదయం కల్వకుర్తి నుంచి ప్రారంభమై అమ్రాబాద్, మన్ననూరు, అచ్చంపేట, తెలకపల్లి, నాగర్కర్నూల్, కోడేరు మండలంలోని ఎత్తంలలో కొనసాగి కొల్లాపూర్కు చేరుకుంది. ఈ సందర్భంగా అమ్రాబాద్, కొల్లాపూర్, ఎత్తం గ్రామాల్లో మూడు కుటుంబాలను షర్మిల పరామర్శించారు.
పార్టీపరంగా అండగా ఉంటామని వారికి భరోసా ఇచ్చారు. యాత్రలో వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డితో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు.