వైసీపీయే అధికారంలోకి వస్తుంది: 'చంద్రబాబు' మిమిక్రీ, 'జగన్! ఐ లవ్యూ...'
శ్రీకాకుళం: ఏపీలోని శ్రీకాకుళం జిల్లా టౌన్హాలులో జరిగిన వైసిపి యువభేరీ సందర్భంగా పలువురు విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు వైసిపి అధ్యక్షులు వైయస్ జగన్ సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా నిఖిల్ ప్రసాద్ అనే విద్యార్థి.. చంద్రబాబు మిమిక్రీతో అలరించాడు
చంద్రబాబును అనుకరించిన నిఖిల్ ప్రసాద్ మాట్లాడుతూ.. 'జగన్ వచ్చే ఎన్నికల్లో మీ పార్టీయే గెలుస్తుంది. ఈ రోజు జనాలను చూస్తుంటే గట్టి నమ్మకంతో ఉన్నారు. వచ్చేసారి టిడిపి అధికారంలోకి రాదు. వైసిపియే అధికారంలోకి వస్తుందని మీకు మనవి చేస్తున్నా. దేశవ్యాప్తంగా మీరు మంచి నాయకుడౌతారు. ఈ యువభేరీకి ఇంత జనం, విద్యార్థులు రావడం చూస్తుంటే అందరి అండదండలు మీకు ఉంటాయని మనవి చేస్తున్నా' అన్నారు.
Photos: ముద్రగడ & తుని దృశ్యాలు
నిఖిల్ ప్రసాద్ మిమిక్రీకు జగన్ నవ్వుతూ ధన్యవాదాలు తెలిపారు. అంతకుముందు సాయిశృతి అనే విద్యార్థిని ఐ లవ్యూ అన్నయ్యా అంటూ జగన్ పైన తన అభిమానం చూపించారు.
సాయిశృతి మాట్లాడుతూ... అమరావతి కోసం సింగపూర్ వాళ్లు ఎందుకు, నెక్స్ట్ ఇయర్ (వచ్చేసారి) మీరే సీఎం అవుతారని, ఐ లవ్యూ అన్నయ్యా.. మీరంటే నాకు చాలా ఇష్టం అని చెప్పింది.
అమరావతికి సింగపూర్ వాళ్ల వ్యాఖ్యలపై జగన్ స్పందిస్తూ... బాబుకు నీ మాటలు వినిపిస్తే జ్ఞానోదయం కలుగుతుందని, ఆయన వయస్సు 70 ఏళ్లని, ఇన్నేళ్లు మన ఇంజినీర్లు కట్టిన వాటిలోనే ఆయన ఉన్నారని, హైదరాబాదులో ఉన్నప్పుడు కూడా కట్టింది మనవాళ్లేనని అన్నారు. మీరంటే నాకు చాలా ఇష్టం అన్నయ్య అన్న వ్యాఖ్యలకు జగన్ థ్యాంక్స్ చెప్పారు.
మరో విద్యార్థి మాట్లాడుతూ.. పుష్కరాల్లో 26 మంది చనిపోతే ఎవరి పైనా చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. దానికి జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబే నిందితుడు కాబట్టి ఎవరి పైనా చర్యలు తీసుకోలేదన్నారు. చంద్రబాబు షూటింగ్ ఆరాటం కోసం అంతమంది చనిపోయారన్నారు. చర్యలు తీసుకుంటే ఆయనను జైల్లో పెట్టవలసి వస్తుందని, అందుకే తీసుకోలేదన్నారు.