ఏపీలో వినూత్న ప్రయోగం: తొలిసారిగా గుంటూరులో స్టూడెంట్ పోలీస్
పోలీస్ శాఖలో ఒక వినూత్న్ర ప్రయోగానికి గుంటూరు రూరల్ జిల్లా వేదిక కానుంది. మనం ఇప్పటివరకు లా అండ్ ఆర్డర్ పోలీస్, ట్రాఫిక్ పోలీస్, ఎక్సైజ్ పోలీస్ ఇలా వివిధ రకాల పోలీసులను చూసి ఉంటాం. కానీ మీరప్పటివరకు చ
అమరావతి: పోలీస్ శాఖలో ఒక వినూత్న్ర ప్రయోగానికి గుంటూరు రూరల్ జిల్లా వేదిక కానుంది. మనం ఇప్పటివరకు లా అండ్ ఆర్డర్ పోలీస్, ట్రాఫిక్ పోలీస్, ఎక్సైజ్ పోలీస్ ఇలా వివిధ రకాల పోలీసులను చూసి ఉంటాం. కానీ మీరప్పటివరకు చూడని ఒక కొత్త పోలీస్ ను గుంటూరు రూరల్ జిల్లాలో చూడబోతున్నారు.
అలా కనిపించబోతున్న ఆ కొత్త పోలీస్ మరెవరో కాదు అతడే స్టూడెంట్ పోలీస్. రూరల్ జిల్లాలో పోలీస్ వ్యవస్థను మరింత మెరుగుపర్చే లక్ష్యంతో గుంటూరు రూరల్ ఎస్పి అప్పలనాయుడు ఈ స్టూడెంట్ పోలీస్ అనే ప్రయోగాన్ని చేపడుతున్నారు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా రూరల్ ఎస్పీ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
Recommended Video


వినూత్న ప్రయోగం స్టూడెంట్ పోలీస్
ఒకవైపు పోలీసు శాఖలో సిబ్బంది కొరతను అధిగమించేందుకు మరోవైపు పోలీసుల పట్ల ప్రజల్లో ఉన్న భయాన్ని పోగొట్టేందుకు ఆయన ఈ ప్రయోగం చేస్తున్నారు. ఈ ప్రయోగం పేరే స్టూడెంట్ పోలీస్ కేడెట్ ప్రోగ్రాం. రాష్ట్రంలో తొలిసారిగా గుంటూరు రూరల్ జిల్లాలో స్టూడెంట్ పోలీస్ కేడెట్ (ఎస్ పి సి) వ్యవస్థను ప్రారంభించేందుకు ఎస్.పి అప్పలనాయుడు సన్నాహాలు చేస్తున్నారు.

స్టూడెంట్ పోలీసులకు ప్రత్యేక శిక్షణ
పోలీస్ శాఖ పట్ల ప్రజల్లో ఉన్న ప్రతికూల అంశాలకు సంబంధించి వారి దృక్పధంలో మార్పు తెచ్చేందుకు స్టూడెంట్ పోలీస్ కేడెట్ (ఎస్ పి సి) ప్రోగ్రామ్ సహాయపడేలా రూరల్ ఎస్పి ఈ కార్యక్రమాన్ని రూపుదిద్దుతున్నారు. అయితే ఈ తరహా కార్యక్రమం మన రాష్ట్రంలో మొదటిదైనా కేరళ ఇప్పటికే ఈ ప్రయోగాన్ని చేపట్టి విజయవంతమైంది. నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్ సి సి) తరహాలో కేరళ ప్రభుత్వం ఈ స్టూడెంట్ పోలీస్ కేడెట్ (ఎస్పీసీ) ప్రొగ్రాం ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. ఈ ప్రోగ్రామ్ కోసమే కేరళ ప్రభుత్వం ప్రత్యేక పాఠశాలలను సైతం ఏర్పాటు చేసి పోలీసు, విద్యా శాఖలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేలా చర్యలు తీసుకుంది. స్టూడెంట్ పోలీస్ కేడెట్లుగా ఎంపిక చేసిన విద్యార్ధుల కోసం 1500 మంది పోలీసు అధికారులు 840 మంది శిక్షణ పొందిన ఉపాధ్యాయులతో ప్రత్యేక తర్ఫీదు ఇప్పించింది. కేరళ ఈ ప్రోగాం ద్వారా మంచి ఫలితాలు రాబట్టడంతో దీంతో ఈ ఏడాది గుజరాత్, హర్యానా, కర్ణాటక, రాజస్థాన్ రాష్ట్రాలు సైతం ఈ కార్యక్రమం అమలు చేసేందుకు సన్నద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల డెహరాడూన్లో నిర్వహించిన నేషనల్ పోలీసు కాంగ్రెస్ సమావేశంలో సైతం ఎస్పీసీ ప్రాజెక్టును దేశవ్యాప్తంగా అమలు చేయాలని సిఫార్సు చేసినట్లుగా తెలుస్తోంది. ఎస్పీసీ కార్యక్రమం ఖచ్చితంగా విజయవంతమవుతుందని ,సమాజంలో దీనిద్వారా ప్రభావవంతమైన మార్పులు తీసుకురావచ్చని విద్యార్ధుల తల్లి దండ్రులు, ఉపాధ్యాయులు అభిప్రాయ పడుతున్నారు.

స్టేషన్ల వారీగా స్టూడెంట్ పోలీసులు
గుంటూరు రూరల్ జిల్లా పరిధిలో మొత్తం 66 పోలీసు స్టేషన్లు ఉన్నాయి. అయితే పోలీసు స్టేషన్ పరిధిని బట్టి ఒక్కో స్టేషన్ కు 20 నుంచి 30 మంది వరకు స్టూడెంట్ పోలీసు కేడెట్లను నియమించాలని ఎస్పీ భావిస్తున్నట్లు తెలిసింది. దీంతో సుమారుగా 2వేల మంది ఎస్పీసీలు పోలీసు శాఖకు సేవలందించే అవకాశం ఉంది. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లోను విలువల పట్ల అవగాహన పెరుగుతుందని, తద్వారా న్యాయం కోసం నిరీక్షిస్తున్న వారిని గుర్తించి పోలీసు శాఖకు చేరువచేయడం ద్వారా పోలీసు శాఖ పట్ల గౌరవం పెంచే అవకాశం ఉంటుందనేది ఎస్పి ఆలోచనగా తెలుస్తోంది.

పోలీసులకు పనిభారం తగ్గించేందుకు...
మిగిలిన రాష్ట్రాల సంగతేమో గాని ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఎస్పీసీ ప్రోగ్రాం అమలు పోలీసు శాఖకు ఎంతో సహాయకారిగా ఉంటుందని పోలీస్ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా రాజధాని జిల్లాగా ఉన్న గుంటూరులో ఇది పోలీసు శాఖకు ఈ కార్యక్రమం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని రూరల్ ఎస్పీ వెంకటప్పలనాయుడు భావిస్తున్నారు. అందువల్ల వీలైనంత త్వరగా ఈ కార్యక్రమం అమల్లోకి తేవడంపై ఎస్పీ సీరియస్గా దృష్టి నిలిపారు. నూతన రాజధాని పరిధిలో గుంటూరు జిల్లా ఉండటంతో ఇక్కడి పోలీసులపై విపరీతమైన పనిభారం పడటంతో పాటు మరోవైపు సిబ్బంది కొరత కూడా తీవ్రంగా వేధిస్తోంది. తీవ్రమైన ఒత్తిడిలో పనిచేయడం వల్లే పోలీసులు సమర్ధవంతమైన పనితీరు కనబర్చలేక ప్రజలకు చేరువ కావలేకపోతున్నారనే భావన ఉంది. ఎస్పీసీ వ్యవస్థ ఏర్పాటు ద్వారా ఈ లోపాలను అధిగమించవచ్చని రూరల్ ఎస్పీ విశ్వసిస్తున్నారు. ఈ దిశలో కసరత్తు చేసి ఇప్పటికే విద్యార్థులకు మంచి శిక్షణ ఇచ్చేందుకు ట్రైనర్లను సైతం గుర్తించి ముందుగా వారికి ప్రత్యేక శిక్షణ అందజేస్తున్నట్లు తెలిసింది.

ఎస్ పి సి గురించి ఎస్పీ మాటల్లో..
స్టూడెంట్ పోలీస్ కేడెట్ ప్రోగ్రామ్ గురించి గుంటూరు రూరల్ జిల్లా ఎస్పి అప్పల నాయుడు వివరిస్తూ ఎస్పీసీ ద్వారా పోలీసులపై నమ్మకం కలిగిస్తామని, అయితే దీనిపై పూర్తి స్థాయిలో కసరత్తు చేయాల్సి ఉందని చెప్పారు. ఎస్పిసి కోసం ఎంపిక చేసిన ట్రైనర్లకు ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నామని, త్వరలో ఈ కార్యక్రమాన్ని అమల్లోకి తెస్తామని తెలిపారు.












Click it and Unblock the Notifications