అమరావతి ఆందోళనల్లో విద్యార్దులు: కొనసాగుతున్న నిరసనలు: కేసులు నమోదు..!
మూడు రాజధానుల ప్రతిపాదనలను వ్యతిరేకిస్తున్న అమరావతి రైతులు..ఆందోళన కొనసాగిస్తున్నారు. అయిదో రోజు రిలే నిరాహారదీక్షల్లో రైతులు కుటుంబ సభ్యులతో సహా పాల్గొన్నారు. ఇక, స్థానికులు..రైతుల ఆందోళనకు మద్దతుగా విద్యార్దులు నిరసనల్లో పాల్గొన్నారు. ఇక, పోలీసులు సైతం ఆందోళనలను నియంత్రించే చర్యలు మొదలు పెట్టారు. ఇప్పటికే ఆందోళన చేస్తున్న వారి పైన ఆరు పోలీసు కేసులు నమో దు అయ్యాయి. మందడంలో పడవ రోడ్డుకు అడ్డంగా పెట్టి ఆందోళనకు దిగటంతో..పోలీసులు పడవను తొలిగించారు. ధర్నా కోసం వేసిన టెంట్ ను సైతం తీసేసారు. పోలీసుల తీరు పైన స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల పైన తిరిగి ప్రయివేటు కేసులు పెడతామని రైతులు చెబుతున్నారు. ఇప్పటికే టీడీపీ నేతలు సైతం దీక్షల్లో పాల్గొంటున్నారు.
అమరావతి నిరసనల్లో విద్యార్దులు..
రాజధాని తరలింపు నిరసిస్తూ అమరావతి ప్రాంత స్థానికులు..రైతులు చేస్తున్న ఆందోళనల్లో విద్యార్ధులు పాల్గొన్నారు. అమరావతి పరిధిలోని విట్ కళాశాలకు చెందిన విద్యార్ధులు మందడంలో రైతులతో కలిసి దీక్షలో పాల్గొన్నారు. రాజధాని తరలించవద్దని స్థానికులు డిమాండ్ చేసారు. ప్రాణాలైనా అర్పిస్తాం..రాజధానిని రక్షించుకుంటాం అని నినాదాలు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు..పిల్లలతో కలిసి రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. వెలగపూడిలో అయిదో రోజు దీక్షలు కొనసాగుతున్నాయి. అదే విధంగా ప్రధాని శంకుస్థాపన చేసిన ఉద్దండరాయుని పాలెంలో వంటా వార్పు ద్వారా నిరసన వ్యక్తం చేసారు. ఇక, విద్యార్దులు సైతం రైతులకు మద్దతు ప్రకటించారు. తమ భవిష్యత్ కోసమే రైతులు త్యాగాలు చేసారని..వారికి మద్దతుగా పోరాటం చేస్తామని స్పష్టం చేసారు.
ఆరు కేసులు నమోదు..
రాజధానిలో మూడు రోజులుగా జరుగుతున్న ఆందోళన నేపథ్యంలో రైతులపై పోలీసులు ఆరు కేసులు నమోదు చేశారు. రాజధాని పరిధిలో 144వ సెక్షన్, 30 పోలీసు యాక్టు అమల్లో ఉన్నప్పటికీ మల్కాపురం జంక్షన్లో ధర్నాలో ఎక్కువ మంది గుమ్మిగూడడమే కాక ఎంతచెప్పినా వినకుండా రాజధాని రైతులు పోలీసులతో గొడవపడి వాగ్వాదానికి దిగారని రూరల్ ఎస్పీ విజయరావు తెలిపారు. బారికేడ్లు పడేసిన ఘటనలను సీసీ ఫుటేజీలు, వీడియోలు, బాడీవోన్ కెమెరాల ద్వారా చిత్రీకరించినట్లు రూరల్ ఎస్పీ తెలిపారు. సెక్రటేరియట్ వైపు దూసుకెళ్ళి ప్రవేశద్వారం వద్ద పోలీసు అధికారులు, సిబ్బంది విధులకు ఆటంకం కలిగించిన వారిపై రెండు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. పలు పంచాయతీ కార్యాలయాలకు నలుపురంగు వేసిన వ్యక్తులపై మూడు కేసులు నమోదు చేశామన్నారు. తుళ్ళూరులోని నీటిపైపులైన్ వద్ద సిబ్బందిని భయపెట్టి.. నీటి సరఫరాను అడ్డుకొన్న ఘటనలో మరో కేసు పెట్టామన్నారు.
ఆమరణ నిరాహాదీక్ష దిశగా..
తాము ఆందోళన చేస్తున్నా..ఇంత వరకు ప్రభుత్వం నుండి స్పందన లేకపోవటం పైన రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజధాని తమ ప్రాంతం నుండి తరలిస్తే..తమకు భవిష్యత్ లేదని..రాజధాని ఉంటుందని చెబితేనే తాము భూములిచ్చామని రైతులు వాపోతున్నారు. ఇప్పటి వరకు రిలే దీక్షలు చేసిన రైతులు..ఇక, ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచేందుకు ఆమరణ నిరాహార దీక్షకు దిగాలని భావిస్తున్నారు. దీని పైన రైతులంతా కలిసి ఈ సాయంత్రం నిర్ణయం తీసుకోనున్నారు. ఇతర ప్రాంతాలను డెవలప్ చేయటానికి తాము వ్యతిరేకంగా కాదని..తాము భూముల మీద ఆధార పడి జీవిస్తూ..రాజధాని కోసం భూములు ఇచ్చామని..ఇక్కడ నుండి ఇప్పుడు రాజధాని తరలిస్తే..తమకు భవిష్యత్ లేదని వారు వాపోతున్నారు. ఇక, ఈ ఆందోళనలకు మద్దతుగా రాజధాని ప్రాంత న్యాయవాదులు సైతం రెండు రోజుల పాటు విధుల బహిష్కరణకు నిర్ణయించారు.