కేసీఆర్పై భగ్గు: కేటీఆర్ను అడ్డుకునేయత్నం, ఉద్రిక్తం
హైదరాబాద్: కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రకటించడంపై విద్యార్థులు భగ్గుమంటున్నారు. కాంట్రాక్టు సిబ్బందిని క్రమబద్ధీకరిస్తే, తమ ఉపాధి అవకాశాలకు గండిపడుతుందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
ఈ క్రమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఐటీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అధికారిక కార్యక్రమానికి అడ్డుతగిలేందుకు విద్యార్థులు యత్నించారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో, అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడగా పోలీసులు పలువురు విద్యార్థులను అరెస్టు చేశారు.
మండిపడ్డ షబ్బీర్ అలీ
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో విద్యార్థుల పాత్ర ఎంతో ఉందని, వారి ఉద్యమం వల్లే రాష్ట్రం వచ్చిందని, అలాంటి విద్యార్థుల పైన ప్రభుత్వం అమానుషంగా ప్రవర్తించడం సరికాదని షబ్బీర్ అలీ అన్నారు. విద్యార్థుల పైన లాఠీఛార్జ్, అరెస్టులను తాను ఖండిస్తున్నానని చెప్పారు.
కాగా, తెలంగాణ మంత్రులకు ఆదివారం విద్యార్థులు షాకిచ్చిన విషయం తెలిసిందే. పాతబస్తీలోని సిటీ కాలేజీలో ఆదివారం జరిగిన అధ్యాపకుల ఫోరం ఆవిర్భావ సదస్సులో గందగోళం చోటుచేసుకుంది. ఈ కార్యక్రమానికి హాజరైన తెలంగాణ మంత్రులు హరీశ్ రావు, జగదీశ్వర్లను తెలంగాణ విద్యార్థులు అడ్డుకుని నిలదీసి అడ్డుకున్నారు.