బాబు డబ్బుల సూట్కేసు పంపితే.. మాకు శిక్షా?: జగన్ సభలో ప్రశ్నలు
కర్నూలు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కర్నూలు నిర్వహించిన యువభేరీలో పలువురు విద్యార్థులు ఏపీ సీఎం చంద్రబాబునాయుడును నిలదీస్తూ పలు ప్రశ్నలు సంధించారు. జగన్ తన ప్రసంగం ముగించిన తర్వాత విద్యార్థులు తమ అభిప్రాయాలను తెలపాలంటూ కోరగా.. వారు ప్రశ్నల వర్షం కురిపించారు.
18దేశాలకు వెళ్లిన చంద్రబాబునాయుడు ఏపీలో ఎన్ని కోట్ల పెట్టుబడులు తెచ్చారని, సీమకు ఏం చేశారని ఓ విద్యార్థిని ప్రశ్నించింది. హోదా కోసం ఏం చేశారంటూ నిలదీసింది. ఇందుకు సమాధానంగా జగన్ మాట్లాడుతూ.. బాబుకు చిత్తశుద్ధి ఉంటే పోరాటం చేసేవాడని అన్నారు.
ఇటీవల విశాఖలో ఓ భారీ సమావేశం నిర్వహించి రూ. 4లక్షల60వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామంటూ గొప్పలు చెప్పుకున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేత, మాజీ స్పీకర్ మనోహర్ ఆర్టీఐ ద్వారా పెట్టుబడులపై సమాచారాన్ని కోరితే.. ప్రభుత్వ అధికారులే అదంతా ఉత్తదనే తేల్చారని జగన్ చెప్పారు. చంద్రబాబు వచ్చిన తర్వాత విశాఖలోని హెచ్ఎస్ బీసీ వెనక్కి వెళ్లిపోయిందని అన్నారు.
మన్నవరం ప్రాజెక్టు కోసం 6వేల కోట్ల పెట్టుబడులు పెట్టారని, ఇప్పుడు అది అతిగతీలేక వెనక్కిపోయే పరిస్థితి ఉందని అన్నారు. ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు వస్తాయని అన్నారు. హోదా రాకుంటే బాబును, కేంద్రాన్ని బంగాళా ఖాతంలో కలిపేద్దామని జగన్ అన్నారు.
'చంద్రబాబు డబ్బుల సూట్ కేసు పంపించి దొరికితే.. ఫలితం మేము అనుభవించాలా?' అంటూ మరో విద్యార్థిని ఘాటుగా ప్రశ్నించింది. దీనికి సమాధానంగా.. దేశంలో ఒక సీఎం నల్లధనం ఇస్తూ ఆడియో, వీడియో టేపులతో దొరికి.. ఇంకా సీఎం కొనసాగడం మనరాష్ట్రంలోనే జరిగిందని జగన్ అన్నారు. ఇది చంద్రబాబుకే సాధ్యమైన పని అన్నారు. ఆయన కాబట్టే మేనేజ్ చేయగల్గుతున్నారని చెప్పారు.
5కోట్ల మంది ఏపీ ప్రజలను స్మూత్గా వెన్నుపోటుపొడిచారని జగన్ ధ్వజమెత్తారు. మీ మాటలతోనైనా చంద్రబాబులో మార్పు వస్తుందని ఆశిద్దామని అన్నారు. ఇది ఇలా ఉండగా, 'హోదా కోసం పోరాడదాం.. జగనన్నను సీఎం చేద్దాం' అని మరో విద్యార్థి బిగ్గరగా అరిచాడు.
'కొడుకు మద్యం తాగి విదేశాల్లో అమ్మాయిలతో తిరిగొచ్చు. ఎమ్మెల్యేలు ఎమ్మార్వోలను కొట్టొచ్చు. మంత్రుల కొడులు నడీరోడ్డుపైనే అమ్మాయిలను ఈడ్చేచ్చు... కానీ, హోదా కోసం పోరాటం చేయొద్దా? అంటూ ఓ విద్యార్థిని ఆవేశంగా ప్రశ్నించారు. అంతేగాక, కుక్కకు ఉండే విశ్వాసం ఆ నాయకులకు లేదా? అంటూ ఘాటుగా వ్యాఖ్యానిచారు.
కాగా, హోదా కోసం పోరాడితే పిల్లలపైనా కేసులు పెడుతున్నారని చంద్రబాబుపై జగన్ ధ్వజమెత్తారు. ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా రావడం లేదని మరో విద్యార్థి ఆరోపించాడు. దీనికి స్పందించిన జగన్ తమ ప్రభుత్వం వచ్చాక 100శాతం ఫీజుల రీఎంబర్స్మెంట్ ఇస్తామని అన్నారు.
మెస్ ఛార్జీలు కూడా చెల్లిస్తామని అన్నారు. తమ నాన్న ఫొటోతోపాటు తన పొటో కూడా ప్రతీ ఇంట్లో ఉండేలా చేస్తానని అన్నారు. ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన చంద్రబాబు.. అరెస్ట్కు భయపడే హోదాపై ఒత్తిడి తేవడం లేదని జగన్ ఆరోపించారు.