హైకోర్టు ఉత్తర్వు: అధికారులపై బాబు ఆగ్రహం, 'హైదరాబాద్ను అలా చేశా'
విజయవాడ: అమరావతి నిర్మాణానికి విద్యార్థుల నుంచి రూ.10విరాళం తీసుకోవాలనే ఉత్తర్వుల పైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విరాళాలు స్వీకరణను హైకోర్టు తప్పుబట్టిన నేపథ్యంలో ఆయన అధికారులపై మండిపడ్డారు.
విద్యార్థులు, ఉపాధ్యాయుల నుంచి రూ.10 చొప్పున విరాళాలు తీసుకోవడంపై హైకోర్టు మొట్టికాయలు వేసింది. పలు వర్గాల నుంచి విమర్శలు వచ్చాయి. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి వచ్చింది. దీంతో అతను విరాళాల సేకరణకు ఉత్తర్వులు ఇచ్చిన విద్యాశాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
స్థిరాస్తి ప్రదర్శనను ప్రారంభించిన చంద్రబాబు
నవ్యాంధ్ర రాజధాని అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దే క్రమంలో స్థిరాస్తి రంగానికి మంచి అవకాశాలుంటాయని ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవరం అన్నారు. విజయవాడలోని ఏ1 కన్వెన్షన్ సెంటర్లో క్రెడాయ్ విజయవాడ విభాగం ఏర్పాటు చేసిన స్థిరాస్తి ప్రదర్శనను ప్రారంభించారు.
ఈ ప్రదర్శనలో విజయవాడ, గుంటూరు జిల్లాలకు చెందిన ప్రముఖ స్థిరాస్తి, అనుబంధ సంస్థలు, బ్యాంకులు తమ స్టాళ్లు ఏర్పాటు చేశాయి. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. కొత్త రాజధాని నిర్మాణంలో ఎన్నో సవాళ్లున్నాయని, అవాంతరాలు అధిగమించి అవకాశాల్ని అందిపుచ్చుకుంటే భవిష్యత్తు మనదేనన్నారు.
సింగిల్ విండో పద్ధతిలో త్వరితగతిన అన్ని అనుమతులు మంజూరు చేయనున్నట్లు చెప్పారు. ఏపీని సుందర రాష్ట్రంగా తీర్చిదిద్దాలనేదే తన కోరిక అని చెప్పారు. స్థిరాస్తి రంగం అంటే ఏపీ గుర్తుకొస్తుందని, హైదరాబాద్ను ఆ విధంగా అభివృద్ధి చేశామన్నారు.