ఆంధ్ర అధికారుల వేధింపులు: తెలంగాణ ఇంజనీర్ ఆత్మహత్యాయత్నం
విశాఖపట్నం: ఉన్నతాధికారులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ విద్యుత్ శాఖ సబ్ ఇంజనీర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తెలంగాణ ప్రాంతానికి చెందిన దళితుడిని కాబట్టే తనను ఉన్నతాధికారులు వేధిస్తున్నారని ఈ సంఘటనకు ముందు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
హైదరాబాద్కు చెందిన శివప్రసాద్ (35) విశాఖ జిల్లా నర్సీపట్నంలోని ఎపి ఈపిడిసిఎల్ కార్యాలయంలో సబ్ ఇంజనీర్గా విధులు నిర్వహిస్తున్నాడు. బుధవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో నర్సీపట్నంలోని పెదబొడ్డేపల్లిలో తాను నివాసం ఉంటున్న ఇంట్లో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశాడు.
తరువాత ఆయన అపస్మారక స్థితికి చేరుకోవడంతో భార్య అపర్ణ సమాచారం ఇవ్వగా, వెంటనే నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో విశాఖ కెజిహెచ్కు తరలించారు. ఎఇ, డిఇలు తనను మానసికంగా హింసిస్తూ, తెలంగాణకు చెందిన వాడినని, అందులోనూ దళితుడినని చిన్నచూపు చూస్తూ తనను వేధింపులకు గురి చేస్తున్నారని శివప్రసాద్ ఆరోపించాడు.
విద్యుత్శాఖ ఎఇ, డిఇలు, ఇతర సిబ్బందికి, తన స్నేహితులకు తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు ఆత్మహత్యాయత్నమానికి ముందు సెల్ఫోన్ ద్వారా మెసేజ్లు పంపాడు.
విద్యుత్శాఖ సబ్ ఇంజనీర్గా పనిచేస్తున్న తన కుమారుడిని ఆ శాఖ ఉన్నతాధికారులు తీవ్ర వేధింపులకు గురి చేశారని శివప్రసాద్ తల్లి ఆరోపించారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన శివప్రసాద్ దళితుడు కావడంతోనే వేధింపులకు గురి చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఉదయం 10 గంటలకు కార్యాలయానికి వెళ్తే తిరిగి రాత్రి 9.30 గంటల వరకు విడిచి పెట్టడం లేదన్నారు. నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని పెదబొడ్డేపల్లికి చెందిన అపర్ణతో అతడికి వివాహమైంది. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారన్నారు.