విశాఖలో సుప్రీం సర్క్యూట్ బెంచ్ కోసం టిఎస్సార్ బిల్లు, అమరావతిలో లాయర్లకు..!
న్యూఢిల్లీ/అనంతపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో సుప్రీం కోర్టు సర్క్యూట్ బెంచ్ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు టి సుబ్బిరామి రెడ్డి శుక్రవారం నాడు రాజ్యసభలో ప్రతిపాదించారు. ఆయన ప్రయివేట్ మెంబర్ బిల్లు ప్రతిపాదించారు.
ఢిల్లీకి వెళ్లే ఖర్చులు మేమే భరిస్తాం: రఘువీరా రెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి ఢిల్లీ వచ్చేందుకు మా ఖర్చులు మేమే భరిస్తామని, వాటిని ప్రభుత్వం పైన మోపమని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి శుక్రవారం అన్నారు. ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు.
ఏపీకి ప్రత్యేక హోదా కోసం అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకు వెళ్లాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ వచ్చేందుకు మా ఖర్చులు మేమే భరిస్తామని తెలిపారు. వాటిని ప్రభుత్వం పైన మోపే ఉద్దేశ్యం లేదన్నారు. కేసులకు భయపడి హోదా కోసం కేంద్రం పైన ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలను విరమించుకోవద్దని హితవు పలికారు.
బెజవాడ లాయర్లకు అమరావతిలో స్థలాలు
బెజవాడ బార్ అసోసియేషన్ న్యాయవాదులకు అమరావతిలో నిర్మించే జస్టిస్ సిటీలో ఇళ్ల స్థలాలు ఇవ్వనున్నారు. ఈ మేరకు గురువారం బెజవాడ బార్ అసోసియేషన్లో సభ్యులుగా ఉన్న వారికి సందేశాలు వచ్చాయని తెలుస్తోంది.
అమరావతిలో జస్టిస్ సిటీ ఏర్పాటు చేసేందుకు సీఆర్డీఏ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. సింగపూర్ బృందం మాస్టర్ ప్లాన్లో జస్టిస్ సిటీని చేర్చారు. జస్టిస్ సిటీలో హైకోర్టు న్యాయమూర్తులకు ఇళ్లు, న్యాయశాఖ సిబ్బందికి క్వార్టర్లు, ఇంకా స్థలాలు మిగిలితే ప్రాక్టీస్ చేసే న్యాయవాదులకు కేటాయించనున్నట్లు చెప్పారు.