చంద్రబాబు ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన స్వామి: వెనక ఎవరు?
తిరుపతి: ఎవరినైనా లక్ష్యం చేసుకున్నాడంటే బిజెపి నేత సుబ్రహ్మణ్యస్వామి ఉడుం పట్టుపడుతాడు. న్యాయపోరాటంలో కాకలు తీరిన సుబ్రహ్మణ్యస్వామి దృష్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై కూడా పడినట్లు ఉంది.
తిరుమల ఆలయ నిర్వహణపై ఆయన శనివారంనాడు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏ ఆలయమైనా సరే మూడేళ్లకు మించి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండకూడదని ఆయన అన్నారు. తిరుమల 1933 నుంచి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉందని చెబుతూ సుప్రీంకోర్టు ఆదేశాలను ఆయన ఉటంకించారు.
టిటిడి ఆలయ భూములపై టిడిపి ప్రభుత్వం ఆధిపత్యం చేస్తోందని, ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని, దానిపై తాను సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని సుబ్రహ్మణ్య స్వామి చెప్పారు. ఆయన వ్యాఖ్యలతో తెలుగుదేశం పార్టీలో కలవరం ప్రారంభమైంది. ఈ వ్యాఖ్యలు చేయడం వెనక ఎవరున్నారనే విషయంపై టిడిపి నేతలు ఆరా తీసినట్లు సమాచారం.
విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపనందేంద్ర స్వామి ఇటీవల సుబ్రహ్మణ్యస్వామిని కలిశారు. ఆయన ప్రోద్బలంతోనే స్వామి చంద్రబాబుపై విమర్శనాస్త్రం ఎక్కుపెట్టినట్లు భావిస్తన్నారు. ఆలయ భూముల విషయంలో సుబ్రహ్మణ్య స్వామి జోక్యాన్ని ఆయన కోరినట్లు సమాచారం.
చంద్రబాబు విధానాలపై స్వరూపానందేంద్ర చాలా కాలంగా వ్యతిరేకతతో ఉన్నారు. చంద్రబాబు తీరుపై విమర్శలు కూడా చేశారు. దీన్ని బట్టే స్వరూపానందేంద్ర కారణంగానే సుబ్రహ్మణ్య స్వామి టిటిడి భూముల వ్యవహారంపై మాట్లాడినట్లు చెబుతున్నారు.