వైఎస్సార్ కుటుంబంలో ఎవరెటు - షర్మిల ఎంట్రీ వేళ, బరిలో వారసులు..!!
ఏపీలో ఎన్నికల రాజకీయం వేడెక్కుతోంది. వైసీపీలో ఇంఛార్జ్ ల మార్పు కసరత్తు కొనసాగుతోంది. గెలుపే ప్రామాణికంగా సామాజిక లెక్కలకు ప్రాధాన్యత ఇస్తూ ముఖ్యమంత్రి జగన్ అభ్యర్దులను ఎంపిక చేస్తున్నారు. అటు టీడీపీ, జనసేన పొత్తుతో జగన్ ఓటమే లక్ష్యంగా వ్యూహాలు సిద్దం చేస్తున్నాయి. ఈ సమయంలో షర్మిల కాంగ్రెస్ లో చేరిక..ఏపీలో కీలక బాధ్యతల ప్రచారం వేళ రాజకీయంగా మరిం ఆసక్తి కరంగా మారుతోంది.
కాంగ్రెస్ లోకి షర్మిల
వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరటం ఖాయమైంది. ఈ నెల 4 లేదా 7వ తేదీన షర్మిల అధికారికంగా కాంగ్రెస్ లో చేరనున్నారు. షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ బాధ్యతలు ఇచ్చేందుకు పార్టీ సిద్దమైంది. కానీ, షర్మిల ఇప్పటి వరకు తన అంగీకారం తెలపలేదని సమాచారం. షర్మిల సుముఖత వ్యక్తం చేస్తే పార్టీ ఏపీ పగ్గాలు అప్పగించేందుకు సిద్దంగా ఉంది. ఇదే సమయంలో షర్మిల కడప నుంచి పోటీ చేస్తారనే ప్రచారం సాగుతున్నా..షర్మిల తనకు అటువంటి ఆలోచన లేదని సన్నిహితులతో చెబుతున్నట్లు సమాచారం. షర్మిల ఏపీలో కాంగ్రెస్ క్రియాశీలకంగా వ్యవహరిస్తే ఎవరెవరు కలిసి వస్తారనే చర్చ మొదలైంది. ఇప్పటికే కొందరు వైసీపీ, టీడీపీ నేతలు టచ్ లోకి వచ్చారంటూ కాంగ్రెస్ నేతలు ప్రచారం మొదలు పెట్టారు.

మార్పులు - చేర్పులు
ఇక, ముఖ్యమంత్రి జగన్ వై నాట్ 175 నినాదంలో భాగంగా సొంత జిల్లాలోనూ మార్పులు, చేర్పుల దిశగా అడుగులు వేస్తున్నారు. కడప జిల్లాలోనూ మార్పుల గురించి సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సారి వైఎస్సార్ కుటుంబం నుంచి కొత్త జనరేషన్ ఎన్నికల్లో ఎంట్రీ ఇవ్వటం ఖాయంగా కనిపిస్తోంది. సీఎం జగన్ తన సొంత జిల్లాల్లో ఎంపీ, ఎమ్మెల్యేల సీట్ల పైన తాజా సర్వే నివేదికల ఆధారంగా కీలక నిర్ణయాలకు సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. వైసీపీ నుంచి రెండు సార్లు ఎంపీగా గెలిచిన వైఎస్ అవినాష్ రెడ్డిని ఈ సారి ఎమ్మెల్యేగా పోటీ చేయించాలనేది జగన్ ఆలోచనగా చెబుతున్నారు. తాజా మార్పుల ఆలోచనల్లో భాగంగా అవినాష్ ను వచ్చే ఎన్నికల్లో జమ్మలమడుగు నుంచి బరిలోకి దింపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
జగన్ కొత్త వ్యూహం
తాజాగా వైఎస్ ఫ్యామిలీలోని వారసులు తెర పైకి వచ్చారు. కడప ఎంపీగా డాక్టర్ అభిషేక్ రెడ్డి పేరు పరిశీలిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. భాస్కరరెడ్డి అన్న ప్రకాశ్ రెడ్డి కుమారుడు వైఎస్ మదన్మోహన్రెడ్డి తనయుడు డాక్టర్ అభిషేక్ రెడ్డి. 2019 ఎన్నికల సమయంలోనూ అభిషేక్ రెడ్డి రాజకీయంగా తెర మీదకు వచ్చింది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నారని తెలుస్తోంది. ఎంపీ అవినాష్ ను జమ్మలమడుగు నుంచి పోటీకి దింపితే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తారని చెబుతున్నారు. ఇదే సమయంలో సీఎం జగన్ కు బంధువు అయిన దుష్యంత్ రెడ్డికి కమలాపురం సీటు ఇస్తారనే వాదన వినిపిస్తోంది. 2019లోనే దుష్యంత్ రెడ్డి కమలాపురం టికెట్ ఆశించారు. ఈసారి అతనికి టికెట్ తప్పకుండా వస్తుందని అందరూ భావిస్తున్నారు. పారిశ్రామికవేత్త గా కూడా కావటంతో ఈ సారి సీటు ఖాయమనే ప్రచారం సాగుతోంది.












Click it and Unblock the Notifications