మన్మోహన్ అబద్దం చెప్పారు, మోడీపై అసంతృప్తి: బీజేపీకి సుజన కౌంటర్
విజయవాడ: ప్రత్యేక హోదా ఏపీ హక్కు అని, దానిని తాము ఎట్టి పరిస్థితుల్లోను వదులుకోమని, హోదా విషయంలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో అబద్దం చెప్పారని కేంద్రమంత్రి, టిడిపి నేత సుజనా చౌదరి ఆదివారం నాడు అన్నారు.
నాడు ఎన్నికల కోడ్ వల్ల హోదాకు చట్టబద్ధత కల్పించలేకపోయామని మన్మోహన్ సింగ్ మొన్న రాజ్యసభలో చెప్పారని, కానీ అది అబద్దమన్నారు. కేంద్ర కేబినెట్ తీర్మానం తర్వాత 5 రోజులకు గానీ ఎన్నికల కోడ్ అమల్లోకి రాలేదన్నారు. కావాలనే ఈ అబద్దం అన్నారు.
ఆయన టీవీ ఇంటర్వ్యూలోను పలు అంశాలపై స్పందించారు. బీజేపీతో రాజకీయ బంధానికి ఇప్పుడు వచ్చిన ముప్పేమీ లేదని చెప్పారు. బీజేపీ మిత్రపక్షమైనా తమకు ఏపీ ప్రయోజనాలు ముఖ్యమని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రయివేటు బిల్లు పేరుతో ఉనికి చాటుకునే ప్రయత్నం చేసిందన్నారు.
చంద్రబాబు జగన్ ట్రాప్లో పడ్డారా: ప్రత్యేక హోదాపై వెంకయ్యXజైట్లీ!
వైయస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ వలలో టిడిపి పడిందని బీజేపీ అనుమానిస్తుందన్న వార్తల పైన కూడా ఆయన స్పందించారు. తాము ఎవరి వలలో పడలేదన్నారు. అలా వలలో పడాల్సిన అవసరం లేదన్నారు. అందరికన్నా ఎక్కువగా హోదా కోసం పోరాడుతోంది టిడిపి నేతలే అన్నారు.
వైయస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీలు హోదా కోసం ఇటీవల పిలుపునిచ్చిన బంద్ పైన మాట్లాడుతూ... బందులు, ఆందోళనలు ఇక్కడ కాదని, ఢిల్లీలో వాయిస్ వినిపిస్తే హోదా వస్తుందన్నారు. ప్రత్యేక హోదా, ఇతర అంశాల పైన బీజేపీ నాటకాలు ఆడుతోందని తాము అనుకోవడం లేదన్నారు.
హోదా విషయంలో సీఎం చంద్రబాబు చేసిన ఘాటు వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఆయన అలా ఏ సందర్భంలో చేశారో తెలియదన్నారు. తాము చంద్రబాబు సూచనల మేరకు నడుచుకుంటామని చెప్పారు. విభజన హామీలను నెరవేర్చాలని తాము కోరుకుంటున్నామని చెప్పారు.
రాజకీయ వ్యూహాలు చెప్పేందుకు తాను రాజకీయ వ్యూహకర్తను కాదని, తమ పార్టీ అధ్యక్షులు అన్నింటిని చూసుకుంటారని చెప్పారు. తనకు రెండోసారి రాజ్యసభ వచ్చే విషయంలో ఎలాంటి అనుమానాలు తనలో కలగలేదని చెప్పారు.
ఏపీకి హోదానా, ప్యాకేజీనా లేక రెండూనా అనేది కొద్ది రోజుల్లో తేలుతుందన్నారు. తమకు మాత్రం రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని చెప్పారు. కేంద్రం ఈ రెండేళ్లలో చేసిన దానితో తాము ఏమాత్రం సంతృప్తిగా లేమని చెప్పారు. ఏపీకి మరింత చేస్తుందని భావిస్తున్నామన్నారు.