ప్రత్యేక హోదాపై సుజన ట్విస్ట్, నేనే సుప్రీంకు: పట్టిసీమపై బాబుకు జెసి షాక్
న్యూఢిల్లీ: ప్రత్యేక హోదా విషయంలో కేంద్రమంత్రి సుజనా చౌదరి సోమవారం నాడు మరో విషయాన్ని చెప్పారు. ఆయన ఢిల్లీలో మాట్లాడారు. విభజన జరగకముందే 14వ ఆర్థిక సంఘం నివేదిక ఇచ్చిందని ఆయన చెప్పారు. ప్రత్యేక హోదా కోసం తాము తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. హోదాపై సానుకూల సంకేతాలు ఉన్నాయని చెప్పారు.
సభా కార్యకలాపాలను అడ్డుకోవడం మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రత్యేక హోదా పైన కాంగ్రెస్ పార్టీ తప్పు చేసిందన్నారు. వారు దానిని వదిలేయడం వల్ల ఇప్పుడు ఇబ్బందులు వస్తున్నాయని అభిప్రాయపడ్డారు.
బిజెపి మాకు మిత్రపక్షమని, దాని పైన అప్పుడే ఒత్తిడి తేవాల్సిన అవసరం లేదన్నారు. ఇతర పార్టీల గురించి తమకు తెలియదని చెప్పారు. మిగతా రాష్ట్రాలతో సమానంగా ఏపీని తీసుకు రావాలని, అలా తీసుకు వస్తారని తాము కేంద్రాన్ని విశ్వసిస్తున్నామని చెప్పారు.
హోదా కోసం మేం ఏం చేస్తున్నామనేది మాకు తెలుసని, చంద్రబాబు కూడా ఏం చేస్తున్నారో తెలుసన్నారు. మా ప్రయత్నాలు ఫలిస్తాయనే నమ్మకం ఉందన్నారు. ఏపీకి మిగతా రాష్ట్రాలకు ఎక్కడా పోలిక లేదన్నారు. మిత్రపక్షంగా ఉన్న కేంద్రంపై ఒత్తిడి అవసరం లేదన్నారు.
సామరస్యపూర్వకంగా సమస్య పరిష్కారమవుతుందన్నారు. కాంగ్రెస్ సభను అడ్డుకోవడానికే తీర్మానించుకుందన్నారు. ఆ పార్టీ వల్ల ప్రజాధనం వృథా అవుతుందన్నారు. అఖిల పక్షంలో కాంగ్రెస్ తన వైఖరిని మార్చుకోవాలన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా పైన ఇవాళ అవకాశం వచ్చినా అది సాధ్యం కాలేదన్నారు.
చర్చకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్నా వినిపించుకునే పరిస్థితిలో కాంగ్రెస్ లేదన్నారు. అన్ని పక్షాలు విజ్ఞప్తి చేసినా కాంగ్రెస్ వైఖరి మార్చుకోవడం లేదన్నారు. దేశంలో ఉన్న పరిస్థితినే కేంద్రమంత్రి రావ్ ఇంద్రజిత్ సింగ్ చెప్పారన్నారు.
కాగా, గతంలో ఏపీకి నిధుల గురించి సుజన చెప్పారు. ఇప్పుడు విభజనకు ముందే ఆర్థిక సంఘం నివేదిక ఇచ్చిందని, ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందని, కేంద్రమంత్రి ప్రకటనతో, ఏపీ ప్రత్యేక హోదాకు సంబంధం లేదని అభిప్రాయపడ్డారు.
అవసరమైతే సుప్రీం కోర్టుకు: జెసి
కృష్ణా జలాల వ్యవహారంలో రాయలసీమకు పూర్తిగా అన్యాయం జరుగుతోందని అనంతపురం ఎంపీ జేసి దివాకర్ రెడ్డి అన్నారు. పట్టిసీమ కల నెరవేరాలంటే వాతావరణం అందుకు అనుకూలించాలని వ్యాఖ్యానించారు. ఐదేళ్లుగా వచ్చిన ప్రాజెక్టులతో సీమ అన్యాయానికి గురవుతోందన్నారు.
రాయలసీమకు ప్రత్యేక కేటాయింపులు కావాలని తాము కేంద్రాన్ని కోరుతామని చెప్పారు. కృష్ణా బోర్డు నుంచి సుప్రీం కోర్టు వరకు ముఖ్యమంత్రి సహా అందర్నీ మరోసారి కలుస్తామన్నారు. తప్పనిసరి అయితే రాయలసీమకు అన్యాయం పైన సుప్రీం కోర్టులో ప్రయివేటు వ్యక్తిగా పిటిషన్ వేస్తానని చెప్పారు. అల్మట్టి నిండితే తప్ప రాయలసీమకు నీరు వచ్చే పరిస్థితి లేదన్నారు.
పట్టిసీమతో రాయలసీమకు నీళ్లు వస్తాయన్న నమ్మకం లేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.