అవమానంకాదు: కేసీఆర్ని కలవకపోవడంపై సుజన
హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలో గురువారం తనకు ఎలాంటి అవమానం జరగలేదని కేంద్రమంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సుజనా చౌదరి శుక్రవారం నాడు విలేకరుల సమావేశంలో తెలిపారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ఢిల్లీలోని తన కార్యాలయానికి ఫోన్ చేసి చెప్పారని, ఆ విషయం తనకు చేరే లోపే తాను సచివాలయానికి చేరుకున్నానని తెలిపారు.
కాగా, రెండు రోజుల క్రితం సుజనా చౌదరి కేసీఆర్ కోసం సచివాలయానికి వెళ్లిన విషయం తెలిసిందే. కేసీఆర్ లోకపోవడంతో ఆయనను కలవకుండానే వెనుదిరిగారు.
ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న నదీజలాలు, ఎంసెట్ తదితర సమస్యలు సామరస్యంగానే పరిష్కరావుతాయని చెప్పారు. రాజధాని కోసం తొలి విడతగా కేంద్రం రూ.2000 వేల కోట్లు విడుదల చేస్తుందని చెప్పారు. ఇవి పదిహేను రోజుల్లో వస్తాయని తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం ఆలస్యమైనా కేంద్రం ప్రత్యామ్నాయ పద్ధతిలో సహకరిస్తుందన్నారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం నుండి విడతల వారీగా నిధులు తీసుకు వస్తామన్నారు.
విభజన బిల్లులో ఉన్న వాటితో నిమిత్తం లేకుండా రాష్ట్రానికి అన్ని రకాలుగా నిధులు తెచ్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. పార్లమెంటులో అంగీకరించి, విభజన చట్టంలో పేర్కొన్న తర్వాత నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గబోదన్నారు. వెనకబడిన ప్రాంతాలకు విరివిగా నిధులు మంజూరు చేస్తోందన్నారు. రాయలసీమ, ఉత్తరాంద్రలోని ఏడు జిల్లాలకు ఏటా ప్రతి జిల్లాకు రూ.60 కోట్లకు తగ్గకుండా నిధులు వస్తాయని తెలిపారు.

రాజధానికి నిధుల విడుదల ప్రణాళికా సంఘం రద్దు, నీతి ఆయోగ్ ఏర్పాటు తదితర కారణాల వల్ల కాస్త ఆలస్యమైందన్నారు. కేంద్రం ఒకేసారి ఎక్కువ నిధులు ఇచ్చినా ఖర్చు చేసే పరిస్థితి రాష్ట్రంలో లేదన్నారు. మొత్తం నిధులను ఐదేళ్లలో ఇస్తారని, కేంద్రం అంచనా ప్రకారం సచివాలయం, రాజ్ భవన్, శాఖాధిపతుల కార్యాలయాలు, ఆఫీసర్స్ క్వార్టర్స్ తదితరాలు అన్నిటికీ కలిపి ఇరవై వేల కోట్ల రూపాయలు ఇచ్చే అవకాశముందని వివరించారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధానిని నిర్మించాలనుకుంటున్న నేపథ్యంలో, ఈక్విటీ రూపంలో నిధులు సమకూర్చుకొనేందుకు ఏపీ ప్రయత్నిస్తోందన్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి చాలా సంస్థలు పోటీ పడుతున్నాయన్నారు. షెడ్యూల్ 13లో పేర్కొన్న విధంగా కేంద్ర విద్యా సంస్థల ఏర్పాటుకు ప్రధాని మోడీ ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు.
రాష్ట్రంలో భూ సేకరణ ఆలస్యమైతే, 2015-16 విద్యా సంవత్సరానికి అద్దె భవనాల్లోనైనా ఐఐటీ, ఐఐఎం, ట్రిపుల్ ఐటీ వంటివి ప్రారంభమవుతాయని వివరించారు. ఎయిమ్స్కు మంగళగిరి వద్ద స్థల సేకరణ జరిగిందన్నారు.
దుగరాజపట్నం, మచిలీపట్నం పోర్టుల ఏర్పాటుపై అధ్యయనం చేస్తున్నామని, ఐవోసీ, హెచ్పీసీఎల్తోపాటు విశాఖలో స్టీల్ ప్లాంట్ విస్తరణ సాధ్యాసాధ్యాలపై ఆరు నెలల్లో స్పష్టత వస్తుందని వివరించారు.

విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక కారిడార్కు నిధులు సమకూర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సుజనా చౌదరి తెలిపారు. విశాఖ, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాల స్థాయి పెంచుతామని, ఏపీకి ప్రత్యేక రైల్వే జోన్ ఖర్చుతో కూడుకున్నదని రైల్వే శాఖ చెప్పిందన్నారు. సీఎం చంద్రబాబు ఒత్తిడి తీసుకు రావడంతో కొత్త రైల్వే జోన్ ఏర్పాటుపై బడ్జెట్లో పొందుపరుస్తారన్నారు.
హైదరాబాద్ నుంచి విజయవాడ జాతీయ రహదారిని మరో నాలుగు లేన్లు పొడిగించే ఆలోచనలో కేంద్రం ఉందని చెప్పారు. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ఏడు నెలల్లో రెవెన్యూ లోటు కొంత తగ్గించగలిగిందన్నారు. ఏటా అన్ని రాష్ట్రాలూ అప్పు కోసం ఆర్బీఐ వద్దకు వెళ్తాయని, అంతమాత్రాన జీతాలకు కూడా నిధులు లేవనడం సరికాదన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇబ్బందులుంటాయని మాత్రమే కేంద్రంతో చంద్రబాబు చెప్పారన్నారు.












Click it and Unblock the Notifications