సభకు ఆలస్యంగా వచ్చిన సుజనా!: రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం వాయిదా
అమరావతి: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. తొలిరోజు ప్రధాని మోడీ కేంద్ర మంత్రివర్గంలోకి కొత్తగా చేరిన 19 మంది మంత్రులను ఉభయ సభలకు పరిచయం చేశారు. అనంతరం ఇటీవల మృతి చెందిన సిట్టింగ్ ఎంపీ సహా మృతి చెందిన మాజీ ఎంపీలకు లోక్సభ నివాళులు అర్పించింది.
అనంతం సభ వాయిదా పడింది. కాగా తొలిరోజు టీడీపీ సీనియర్ నేత, కేంద్ర శాస్త్ర, సాంకేతిక వ్యవహారాల శాఖ సహాయ మంత్రి సుజనా చౌదరి రాజ్యసభ సభ్యుడిగా చేయాల్సిన ప్రమాణం మరోమారు వాయిదా పడింది. కొత్తగా రాజ్యసభకు ఎన్నికైన ఎంపీల్లో ఇప్పటికే చాలా మంది ప్రమాణం చేశారు.
సోమవారం జరిగిన సభా కార్యక్రమాల్లో భాగంగా బీజేపీ సీనియర్ నేతలు, కేంద్ర మంత్రులు వెంకయ్య, నిర్మలా సీతారామన్ సహా మొత్తం 43 మంది చేత రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ ప్రమాణం చేయించారు. వెంకయ్య హిందీలో ప్రమాణం చేయగా, కర్ణాటక నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కన్నడంలో, ఏపీ నుంచి ప్రాతనిథ్యం వహిస్తున్న టీజీ వెంకటేశ్ ఇంగ్లీష్లో ప్రమాణం చేశారు.
వీరితో పాటు కేంద్రమంత్రి సుజనా చౌదరి కూడా ప్రమాణం చేయాల్సి ఉంది. అయితే నిర్దేశిత సమయానికి కాస్తంత ఆలస్యంగా సుజనా సభకు వచ్చారు. దీంతో ఆయన సోమవారం రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం చేయలేకపోయారు. ఈ నేపథ్యంలో వచ్చే సోమవారం తాను ప్రమాణం చేయనున్నట్లు ఆయన రాజ్యసభ చైర్మన్కు సమాచారం అందించారు.