కేంద్ర బడ్జెట్: 'ఏపీకి న్యాయం జరుగుతుంది, ఒత్తిడితో ఏదీ సాధించలేం'
విజయవాడ: ఆంధ్రప్రదేశ్కు ఈ బడ్జెట్లో ప్రత్యేకహోదా ఇస్తారని తాను భావించడం లేదని కేంద్ర మంత్రి సుజనా చౌదరి తెలిపారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేక హోదా ఇప్పుడు రాకపోయినా కొన్నాళ్లలో ప్రత్యేకహోదా తప్పక వస్తుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
అయితే రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొనటువంటి కొన్ని ఇతర సౌకర్యాలను మాత్రం కేంద్రం ఇచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ఎన్నో ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు ఏర్పడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత తొలి ఏడాది 10వేల కోట్లు ఇస్తారని అనుకున్నామని, అయితే 8,800 కోట్ల రూపాయలకు కేంద్రం ఇచ్చిందని ఆయన వెల్లడించారు.

కేంద్రం ఇబ్బందులు కేంద్రానికి ఉన్నాయని, వాటిని అనుసరించి ఆంధ్రప్రదేశ్ సమస్యలు తీరుస్తుందని తాను భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి రావాల్సిన నిధులను కేంద్రం ఇస్తుందన్న విశ్వాసముందని తెలిపారు.
పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు కనుక దానిని పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానిదేనని ఆయన స్పష్టం చేశారు. కాబట్టి కేంద్రమే ఆ ప్రాజెక్టును పూర్తి చేస్తుందని అన్నారు. రాజధాని నిర్మాణంలో ఎటువంటి సాంకేతిక సమస్యలు లేవని తేల్చిచెప్పారు.
కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తే ఏమీ సాధించలేమని చెప్పిన ఆయన, సహకారంతోనే ఏదైనా సాధ్యమని అన్నారు. ఇది ఇలా ఉంటే కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం (ఫిబ్రవరి 29)న కేంద్ర బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications