పవన్ కళ్యాణ్కూ కోపం తెప్పించారు: బాబును ఇరకాటంలో పడేసిన సుజన
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓ మంత్రి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారట.
విజయవాడ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓ మంత్రి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారట. విభజన తర్వాత ఏపీ కష్టంగా ముందుకు సాగుతోంది. ఏపీని అభివృద్ధిపథంలో తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి పెట్టుబడుల కోసం చక్కర్లు కొడుతున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ పైన దృష్టి సారించారు.
చంద్రబాబు ఒక్కో సమస్యను అధిగమిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ మంత్రి ఆయనకు ఇబ్బందులు కొని తెస్తున్నారట.
ప్రత్యేక హోదా అంశం ఏపీలో ఎప్పుడూ కనిపిస్తూనే ఉంది. అయితే, జల్లికట్టు ఉద్యమం తర్వాత దాని వేడి మరింత రాజుకుంది. హోదాకు మద్దతుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వచ్చాయి... వస్తున్నాయి.
జనవరి 26వ తేదీన ఆర్కే బీచ్లో మెరీనా బీచ్ తరహా ఉద్యమానికి యువత పిలుపునిచ్చింది. దానికి జగన్, పవన్ కళ్యాణ్ మద్దతు పలికారు. అయితే, రిపబ్లిక్ డే కావడం, ఆ తర్వాత సిఐఐ సమ్మిట్ ఉండటంతో పోలీసులు వ్యూహాత్మకంగా దానిని తిప్పికొట్టారు.

ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రమంత్రి, టిడిపి నేత సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.
ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని గతంలో అన్నారు. మొన్న కూడా అన్నారు. కానీ ఆ తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలే కలకలం రేపుతున్నాయి. జల్లికట్టే మీకు స్ఫూర్తి అయితే వెళ్లి కోడిపందాలు, పందుల పందాలు ఆడుకోండని వ్యాఖ్యానించారు. ఈ మాటలే ఇప్పుడు ఇబ్బందుల్లోకి నెట్టాయి.
ఆయన వ్యాఖ్యల పైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఆగ్రహించారు. నోరు అదుపులో పెట్టుకోవాలని పవన్ హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఆయన బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టారని మండిపడ్డారు.
రాయపాటి, సుజనా వంటి వాళ్లని చంద్రబాబు పక్కన పెట్టుకోవడం మంచిది కాదని పవన్ చెప్పడం గమనార్హం. సుజన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు నష్ట నివారణ చర్యల చేపట్టారు.
సుజన వ్యాఖ్యలపై వైసిపి, పవన్ స్పందనతో చంద్రబాబు అప్రమత్తమయ్యారు. నోరు జారవద్దని క్లాస్ పీకారు. ప్రజా సమస్యలు, ఆందోళనలు జరుగుతున్నప్పుడు ఆలోచించి మాట్లాడాలని హితవు పలికారు. వివరణ ఇవ్వాలని చంద్రబాబు సూచించారు. మొత్తానికి సుజన వ్యాఖ్యలు చంద్రబాబును బాగా ఇరకాటంలో పెట్టాయని అంటున్నారు.












Click it and Unblock the Notifications