సుజనా 'నాట్ కరెక్ట్..' వెళ్లింది హోదా కోసం కాదు : చంద్రబాబు
విజయవాడ : ప్రత్యేక హోదా విషయంలో రాజ్యసభలో సుజనా చౌదరి వ్యవహరించిన తీరును తప్పుబట్టారు సీఎం చంద్రబాబు. హోదాకు సంబంధించి కేవీపీ ప్రవేశ పెట్టిన ప్రైవేటు బిల్లును ఆర్థిక బిల్లా కాదా అన్న అంశం లోక్ సభ స్పీకర్ తేలుస్తారని స్పీకర్ కురియన్ ప్రకటించడంతో.. దానిపై హర్షం వ్యక్తం చేస్తూ సుజనా చప్పట్లు కొట్టడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే.. ప్రైవేటు బిల్లు గురించి ప్రస్తావిస్తూ.. రాజ్యసభలో సుజనా చౌదరి చప్పట్లు కొట్టడం సరైన చర్య కాదని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రైవేటు బిల్లు ప్రవేశ పెట్టేముందు బేషరుతుగా మద్దతునిస్తామని టీడీపీ ఎంపీలు చెప్పగా.. సభలో బిల్లు ఓటింగు కోసం పార్టీలకు అతీతంగా సభ్యులంతా పట్టుబడుతున్న సమయంలో సుజనా ఇలా వ్యవహరించడం విమర్శలకు దారి తీసింది.

కేవీపీ ప్రైవేటు బిల్లు ఆర్థిక బిల్లా కాదా అనేది లోక్ సభ నిర్ణయిస్తుందని కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించగానే.. జైట్లీ ప్రకటనను కాంగ్రెస్ నేతలంతా తీవ్రంగా వ్యతిరేకించారు. బిల్లుపై నిర్ణయాన్ని స్పీకర్ కు వదిలేయడంతో.. బిల్లు విషయాన్ని లోక్ సభ నిర్దారిస్తుందని కురియన్ ప్రకటించారు. ఇలా కురియన్ ప్రకటన వెలువడగానే.. సుజనా చౌదరి ఆనందంతో చప్పట్లు కొట్టేశారు. ఇకపోతే కాంగ్రెస్ ప్రైవేటు బిల్లును కేవలం ఆ పార్టీ రాజకీయ లబ్డి కోసమేనని అభివర్ణించిన చంద్రబాబు.. జీఎస్టీ బిల్లుకు, ప్రైవేటు బిల్లుకు కాంగ్రెస్ ఎందుకు లింకు పెట్టి వాదించలేదని ప్రశ్నించారు.
ఇదిలా ఉంటే తన తాజా ఢిల్లీ పర్యటన గురించి ప్రస్తావించిన చంద్రబాబు.. తాను ఢిల్లీ వెళ్లింది హోదా గురించి చర్చించడానికి కాదని, కేవలం పుష్కరాలకు మోడీని ఆహ్వానించడానికి మాత్రమే వెళ్లాలని స్పష్టం చేశారు. అయితే రాష్ట్ర ప్రయోజనాలను మాత్రం నెరవేర్చాలని ప్రధాని మోడీని కోరినట్లు తెలిపారు చంద్రబాబు.












Click it and Unblock the Notifications