శుభపరిణామం: బాబుపై సుమన్ ప్రశంసల జల్లు
తిరుపతి: రాష్ట్ర విభజనతో తీవ్ర ఆర్థికలోటు ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టడం శుభపరిణామమని ప్రముఖ సినీనటుడు సుమన్ అభిప్రాయపడ్డారు. సీఎంగా చంద్రబాబుకు ఉన్న సుదీర్ఘ అనుభవంతో ఏపీని త్వరగా ప్రగతి పథంవైపు నడిపిస్తారన్న నమ్మకం ప్రజలకు ఉందన్నారు. స్నేహితులతో కలిసి గురువారం వేకువజామున ఆయన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని సుప్రభాత సేవలో దర్శించుకున్నారు.
తిరుగు ప్రయాణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు పాలనపై ప్రతిపక్షాలు విమర్శలు చేసినా రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడకూడదని సూచించారు. హుధుద్ తుఫాను కారణంగా విశాఖపట్టణం అతలాకుతలమైందన్నారు. అలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు రాత్రింబవళ్లు అక్కడే గడిపి బాధిత ప్రాంతాలు త్వరగా కోలుకునేలా చర్యలు తీసుకోవడం అభినందనీయమన్నారు.

విద్యుత్, నీటి సరఫరా, ప్రజలకు ఆహార పదార్థాల పంపిణీ, రోడ్ల నిర్మాణం, వాహనాలు, రైళ్ల రాకపోకలను త్వరగా పునరుద్ధరించడానికి కృషి చేశారని సుమన్ గుర్తు చేశారు. వేసవిలో ఎదురయ్యే కొరతను దృష్టిలో పెట్టుకుని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రజలు ఇప్పట్నుంచే విద్యుత్తును, నీటిని పొదుపుగా వాడుకోవాలని ఆయన సూచించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, రెండు రాష్ట్రాలుగా విడిపోయినా అన్నదమ్ముల్లా మెలగాలని సుమన్ హితవు పలికారు.
కథ నచ్చితే ఏ పాత్రయినా పోషించడానికి తాను సిద్ధమని సినీనటుడు సుమన్ వెల్లడించారు. ఏ భాషలోనైనా తనకు ఇచ్చే పాత్రకు సంబంధించిన కథ బాగుంటే వెంటనే ఒప్పేసుకుంటానన్నారు. తన 36 ఏళ్ల సినీ జీవితకాలంలో దాదాపుగా 350 చిత్రాల్లో నటించానన్నారు. భగవంతుడి ఆశీస్సులు, అభిమానుల ఆదరణతో తాను ఇప్పటికీ చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నానని హర్షం వ్యక్తంచేశారు.
ప్రస్తుతానికి తెలుగులో ‘రుద్రమదేవి' చిత్రంలో ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నానని, మరో చిత్రంలోనూ నటిస్తున్నట్లు తెలిపారు. తమిళం, కన్నడ, మళయాళం, హిందీ భాషల్లో మొత్తం ఎనిమిది చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నానని చెప్పారు.












Click it and Unblock the Notifications