వివేకా హత్య కేసు : జైల్లో ఉండే సాక్షులకు బెదిరింపులు -సునీత తరఫు లాయర్ల వాదనలు..!!
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో హైకోర్టులో విచారణ సమయంలో కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. అసలు ఈ కేసు దర్యాప్తుకు ఎంత సమయం పడుతుందో చెప్పాలంటూ సీబీఐని హైకోర్టు ప్రశ్నించింది. వివేకా హత్య కేసులో సీబీఐ అరెస్ట్ చేసిన నిందితులు సునీల్ యాదవ్(ఏ2), గజ్జల ఉమాశంకర్రెడ్డి(ఏ3), డీ శివశంకర్రెడ్డి(ఏ5) బెయిల్ కోసం పిటిషన్లు దాఖలు చేసారు.
ఇవి విచారణకు వచ్చాయి. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది టీ నిరంజన్రెడ్డి వాదనలు వినిపించారు. అప్రూవర్గా మారిన దస్తగిరి (ఏ4) వాంగ్మూలం తప్ప హత్య విషయంలో పిటిషనర్ ప్రమేయం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని.. సీబీఐ దర్యాప్తు పూర్తి చేసి ఇప్పటికే రెండు చార్జిషీట్లు దాఖలు చేసిందని కోర్టుకు నివేదించారు.

సీబీఐకి హైకోర్టు ప్రశ్నలు
పిటిషనర్ గత ఆరునెలలుగా జైల్లోనే ఉన్నారని చెప్పారు. ఎలాంటి షరతులు విధించినా అభ్యంతరం లేదని చెబుతూ... పిటిషనర్కి బెయిల్ మంజూరు చేయాలని కోర్టును అభ్యర్ధించారు. దీంతో..విచారణ సమయం గురించి సీబీఐని న్యాయమూర్తి ప్రశ్నించారు. నిందితుల వ్యక్తిగత స్వేచ్ఛని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బెయిల్పై నిర్ణయం తీసుకొనే సమయంలో వివేకా కుమార్తె సునీత ఆందోళనను తాము పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సీబీఐ తరఫు న్యాయవాది తన వాదనల్లో భాగంగా.. దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా శివశంకర్ రెడ్డి ప్రమేయం నిర్ధారణ అయిందన్నారు.

సునీత తరపు న్యాయవాది అభ్యంతరం
ఆయన పై రెండు దేవిరెడ్డిపై ప్రాథమికంగా రెండు చార్జిషీట్లు దాఖలు చేశామని... దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని కోర్టుకు వివరించారు. శివశంకర్ రెడ్డిపై హత్య, హత్యాయత్నం, మహిళల గౌరవానికి భంగం కలిగించడం వంటి 31 కేసులు ఉన్నాయన్నారు. అరెస్ట్ అయిన దగ్గర నుంచి సాక్షులను బెదిరిస్తూ కేసు దర్యాప్తును ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు.మరో వైపు.. శివశంకర్రెడ్డి జైల్లో ఉంటూనే సాక్షులను బెదిరిస్తున్నారని.. హత్యలో అతని ప్రమేయం బలంగా ఉన్నట్లు సీబీఐ దాఖలు చేసిన రెండో చార్జిషీట్ ద్వారా స్పష్టమవుతోందంటూ వివేకా కుమార్తె సునీత తరఫు న్యాయవాది గూడపాటి వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. కేసు దర్యాప్తులో రాష్ట్ర పోలీసులు.. సీబీఐకి సహకరించడం లేదని పేర్కొన్నారు.

బెయిల్ కోరుతూ పిటీషన్లు
దర్యాప్తు పూర్తి అయ్యి, హత్యవెనుక కుట్రదారులు ఎవరో తేలేవరకు నిందితులకు బెయిల్ మంజూరు చేయవద్దని కోరారు. క్రూరమైన హత్య ఘటనలో నిందితులకు బెయిల్ ఇవ్వడానికి వీల్లేదని వాదించారు. వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి...కేసు దర్యాప్తును ఎప్పటిలోగా పూర్తి చేస్తారో చెప్పాలని సీబీఐని ఆదేశించారు. అదే విధంగా దిగువ కోర్టులో రెండో చార్జిషీట్ దాఖలు చేసిన తరువాత దర్యాప్తు పురోగతిపై వివరాలు సమర్పించాలని న్యాయస్థానం సీబీఐని ఆదేశించింది. సీబీఐ అందజేసిన వివరాల ఆధారంగా వాదనలు వినిపించాలని పిటిషనర్లకు స్పష్టం చేసింది. విచారణను ఈనెల 19కి వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications