ఆంధ్ర బ్యాంక్ ఖాతాలోనే జమ చేశా: సూపర్ స్టార్ కృష్ణ
హైదరాబాద్: సినిమాల్లో నటించడం ద్వారా అందిన మొదటి పారితోషికాన్ని తాను ఆంధ్రాబ్యాంకులోనే జమ చేశానని ప్రముఖ సినీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ తెలిపారు. ఫిలింనగర్ సొసైటీ భవనంలోని ఆంధ్రాబ్యాంకును ఆధునికీకరించి నవశక్తి బ్రాంచిగా అభివృద్ధి పరిచారు. ఈ బ్రాంచిని సినీనటులు కృష్ణ, విజయనిర్మల దంపతులు గురువారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడారు. ఆంధ్రాబ్యాంకుతో తనకు అవినాభావ సంబంధం ఉందని ఆయన చెప్పుకున్నారు. మొదటి నుంచి తన ఖాతాలు ఆంధ్రాబ్యాంకులోనే ఉన్నాయన్నారు. ఆంధ్రాబ్యాంకులో అడుగుపెట్టగానే సొంత ఇంట్లో ఉన్నట్టు ఉంటుందని ప్రముఖ సినీ నటి, దర్శకురాలు విజయనిర్మల అన్నారు.
భారతీయ విద్యాభవన్ ఎక్స్టెన్షన్ కౌంటర్గా ఉన్నప్పుడు సొసైటీ కార్యాలయంలో స్థలం కేటాయించామని ఫిలింనగర్ సొసైటీ కార్యదర్శి కాజా సూర్యనారాయణ అన్నారు. సినీ రంగానికి ఆంధ్రాబ్యాంకుకు అవినాభావ సంబంధం ఉందని బ్యాంకు హైదరాబాద్ జీఎం రవికుమార్ అన్నారు.
దేశంలో 2200 బ్రాంచీలు కలిగి ఉన్న తమ బ్యాంకు ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని 294 నవశక్తి బ్రాంచీలుగా అభివృద్ధి పరిచినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ, నటుడు కైకాల సత్యనారాయణ, ఆంధ్రాబ్యాంకు డైరెక్టర్ వెంకటరమణారెడ్డి బ్రాంచి ఉద్యోగులు పాల్గొన్నారు.