కేసీఆర్పై కృష్ణ పొగడ్త వెనుక.. హీరో మహేష్ బాబు నో!
హైదరాబాద్: సూపర్ స్టార్ కృష్ణ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన ప్రశంసలు కురిపించడమే కాకుండా.. తెలంగాణలో నిర్మించి చిత్రపురికి కేసీఆర్ పేరు పెట్టాలని సూచించడం వెనుక అంతరార్థం మరొకటి ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా హైదరాబాద్లోని పద్మాలయ స్టూడియోస్కు కేటాయించిన భూములను కాపాడుకోవడమే లక్ష్యంగా ఇలా చెప్పి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు.
పద్మాలయ స్టూడియో కోసం కేటాయించిన భూముల్లో నిరుపయోగంగా ఉన్న భూములను స్వాధీనం చేసుకోనున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన విషయం తెల్సిందే. దీంతో కృష్ణ తనదైన శైలిలో కేసీఆర్ను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, అందులో భాగంగానే ఆయన సీఎం పేరును చిత్రపురికి సూచించారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పద్మాలయ భూముల పైన గతంలో నేటి మంత్రి, తెరాస నేత హరీష్ రావు కోర్టుకు కూడా వెళ్లారు.
ఇప్పుడు తెలంగాణలో తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పటికే ఆక్రమించిన భూముల పైన తెలంగాణ ప్రభుత్వం కొరఢా ఝులిపిస్తుంది. ఇందులో భాగంగా కొద్ది రోజుల క్రితం ఎన్ కన్వెన్షన్ పైన కూడా చర్యలకు ఉపక్రమించింది. ఆక్రమించిన భూముల పైన, ఆయా పరిశ్రమల అభివృద్ధికి ఇచ్చిన భూములు నిరుపయోగంగా ఉంటే వెనక్కి తీసుకుంటాని కేసీఆర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కృష్ణ రంగంలోకి దిగి కేసీఆర్ను ప్రసన్నం చేసుకునేందుకే అలా మాట్లాడి ఉంటారని అంటున్నారు.
హైదరాబాద్లో 2 వేల ఎకరాల్లో నిర్మించనున్న సినీ నగరానికి కేసీఆర్ ఫిల్మ సిటీ అని నామకరణం చేయాలని కృష్ణ సూచించిన విషయం తెలిసిందే. ఇదే అంశంపై కృష్ణ తనయుడు, హీరో మహేష్ బాబును పలుకరించగా, ఆయన నో కామెంట్స్ అంటూ విలేకరులకు దూరంగా వెళ్లిపోయారట!
గురువారం హైదరాబాద్లో హీరో నరేష్ తనయుడు నవీన్ తెలుగు చిత్రసీమకు పరిచయం చేస్తూ తొలి సినిమా ప్రారంభోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రకటనపై కృష్ణను మీడియా పలుకరించగా, ఆయన పై విధంగా స్పదించారు. 2 వేల ఎకరాల్లో నిర్మించే సినీ నగరాన్ని అంతర్జాతీయ హంగులతో నిర్మించనున్నారని, ఇందులో హాలీవుడ్ స్థాయిలో చిత్రాలు నిర్మించవచ్చన్నారు. ఫిల్మ్ సిటీకి కేసీఆర్ పేరు పెట్టాలన్నది తన వ్యక్తిగత అభిప్రాయమని కృష్ణ చెప్పారు.