చంద్రగిరిలో రీపోలింగ్ - సుప్రీంకోర్టు నిర్ణయం ఇదే..!
ఏపీలో ఈసారి సార్వత్రిక ఎన్నికల సందర్భంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న నియోజకవర్గాల్లో రాయలసీమలోని చంద్రగిరి కూడా ఒకటి. ఇక్కడ వైసీపీ అభ్యర్ధి చెవిరెడ్డి మోహిత్ రెడ్డికీ, టీడీపీ అభ్యర్ధి పులివర్తి నానికీ మధ్య హోరాహోరీ పోరు జరిగింది. ఈ నేపథ్యంలో పోలింగ్ సందర్భంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడం, ఇరువర్గాలకూ గాయాలు కావడం కూడా జరిగాయి. దీంతో నాలుగు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ కోరుతూ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు తీర్పు ప్రకటించింది.
చంద్రగిరిలోని నాలుగు పోలింగ్ కేంద్రాల్లో ఫామ్ 17సీ, అసలు ఓట్ల స్క్రూటినీ, రీపోలింగ్ కోరుతూ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని హైకోర్టు తోసిపుచ్చడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చంద్రగిరిలోని నాలుగు పోలింగ్ కేంద్రాల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని, కాబట్టి అక్కడ రీపోలింగ్ నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని చెవిరెడ్డి తన పిటిషన్ లో కోరారు. అయితే సుప్రీంకోర్టు ఇందుకు నిరాకరించింది.

ఎన్నికల ప్రక్రియ పూర్తయి ఓట్ల లెక్కింపుకు రంగం సిద్ధమవుతున్న వేళ చెవిరెడ్డి కోరిన విధంగా రీపోలింగ్ కు ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఈసీ విధుల్లో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు తేల్చిచెప్పేసింది. దీంతో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పిటిషన్ ను తోసిపుచ్చింది. చంద్రగిరిలో విజయంపై వైసీపీ, టీడీపీ ఇరువురూ ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు ప్రభావం ఎవరిపై పడనుందో రేపు తేలిపోతుంది.












Click it and Unblock the Notifications