ఎమ్మెల్సీ అనంతబాబు విషయంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
ఎమ్మెల్సీ అనంతబాబుకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. మే నెలాఖరు నుంచి ఆయన రిమాండ్ లో ఉన్నారు. తనకు డ్రైవర్ గా పనిచేసిన దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్యకు గురవడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇంటికి వచ్చి సుబ్రమణ్యాన్ని తీసుకువెళ్లిన అనంతబాబు ఆ తర్వాత తెల్లవారుజాము సమయంలో మీ అబ్బాయికి యాక్సిడెంట్ అయ్యిందంటూ సుబ్రమణ్యం ఇంటిదగ్గర మృతదేహాన్ని ఉంచి వెళ్లారు. హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుపై కేసు నమోదవగా ఎఫ్ఐఆర్ రీ రిజిస్టర్ ఎలా చేస్తారని హైకోర్టు రెండురోజుల క్రిందట పోలీసులను ప్రశ్నించింది.
అనంతబాబు కేసును సీబీఐకి అప్పగించాలని సుబ్రమణ్యం తల్లిదండ్రులు నూకరత్నం, సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అనంతబాబు భార్య, మరికొందరి సమక్షంలో ఈ హత్య జరిగిందని పిటిషనర్ల తరఫున జడ శ్రావణ్ కుమార్ కోర్టులో వాదనలు వినిపించారు. సీసీటీవీ ఫుటేజ్ లో వారంతా కనిపిస్తున్నారని, అయితే వారిపై కేసు నమోదు చేయకుండా ల్యాబ్ నుంచి వచ్చే నివేదిక కోసం చూస్తున్నామంటూ పోలీసులు కాలక్షేపం చేస్తున్నారని శ్రావణ్ కుమార్ న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కావడంతో దర్యాప్తు సజావుగా సాగడంలేదని, మృతుడి శరీరంపై 32 తీవ్ర గాయాలున్నాయని, దీన్నిబట్టి ఘటనలో అనంతబాబుతోపాటు మరికొందరు పాల్గొన్నట్లు స్పష్టమవుతోందన్నారు.
ఈ కేసును మొదటి అనుమానాస్పద మృతి కింద నమోదు చేశారు. బాధితుడి బంధువులు నిరసన చేయడంతో ఎమ్మెల్సీని నిందితుడిగా చేర్చారు. రిమాండ్ విధించిన 14 రోజుల్లో కస్టడీ కోసం పోలీసులు పిటిషన్ వేయలేదు. గడువు దాటిన తర్వాత దాఖలు చేశారు. దీంతో మెజిస్ట్రేట్ కోర్టు ఈ పిటిషన్ ను తిరస్కరించింది. ఎమ్మెల్సీపై రౌడీషీట్ ఉన్నప్పటికీ ఎలాంటి నేర చరిత్ర లేదని కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని శ్రావణ్ కుమార్ కోరారు.