జగన్ సర్కార్ కు సుప్రీం కీలక ప్రశ్న-అత్యవసర విచారణకు నో-మార్చిలో హైకోర్టు తీర్పిస్తే..?
ఏపీ రాజధానిగా అమరావతినే నిర్ణయిస్తూ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుపై జగన్ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్ధానంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఛీఫ్ జస్టిస్ బెంచ్ నుంచి మరో బెంచ్ కు మారిన ఈ పిటిషన్లపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దీనికి ఏపీ ప్రభుత్వం వద్ద సమాధానం లేదు.
అమరావతి పిటిషన్లపై సుప్రీం విచారణ
అమరావతినే రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం వీటిపై సత్వర విచారణ చేయాలని గతంలో ఛీఫ్ జస్టిస్ యూయూ లలిత్ ను కోరింది. అయితే నాట్ బిఫోర్ మీ అంటూ ఆయన ఆ పిటిషన్ల విచారణ నుంచి తప్పుకున్నారు. దీంతో ఇవాళ జస్టిస్ కేఎం జోసఫ్, జస్టిస్ హృషికేష్ రాయ్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. విచారణ సందర్భంగా పలు అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. దీనిపై సుప్రీంకోర్టు స్పందించింది. అయితే విచారణ మాత్రం ముందుకు సాగలేదు.
సత్వర విచారణ కోరిన జగన్ సర్కార్
అయితే మరోసారి అమరావతి పిటిషన్లపై విచారణను సత్వరం పూర్తి చేయాలని సుప్రీంకోర్టును ఏపీ ప్రభుత్వం కోరింది. అమరావతి పిటిషన్లను ఏపీ విభజన చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన రిట్లతో కలిపి విచారణ చేయాలని సీజేఐ ఆదేశించిన నేపథ్యంలో ఇవాళ ఈ రెండు అంశాలపై ద్విసభ్య ధర్మాసనం విచారణ ప్రారంభించింది. దీంతో ఈ విచారణ ఆలస్యమవుతుందని భావించిన ఏపీ సర్కార్.. అత్యవసరంగా దీనిపై విచారణ చేయాలని కోరింది. దీనిపై న్యాయమూర్తి కేఎం జోసఫ్ అభ్యంతరం తెలియజేస్తూ ఏపీ ప్రభుత్వానికి కీలక ప్రశ్న వేశారు.
మార్చిలో హైకోర్టు తీర్పిస్తే ఇప్పుడొచ్చారే ?
అమరావతి పిటిషన్లపై రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర విచారణ కోరడాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం అభ్యంతరం తెలిపింది. మార్చిలో హైకోర్టు అమరావతిపై తీర్పు ఇస్తే సెప్టెంబర్ లో సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ ఎందుకు దాఖలు చేశారని న్యాయమూర్తి జస్టిస్ కేఎం జోసఫ్ రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది నిరంజన్ రెడ్డిని ప్రశ్నించారు. అనంతరం అత్యవసర విచారణ విజ్ఞప్తిని తిరస్కరించిన ధర్మాసనం.. నవంబర్ 14కు విచారణను వాయిదా వేసింది. అమరావతి పిటిషన్లను అధ్యయనం చేయడానికి తమకు కొంత సమయం కావాలని న్యాయమూర్తి తెలిపారు. అయితే రైతుల తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది ఫాలీ నారిమన్ బ్రీఫ్ నోట్ ఇస్తామని సుప్రీంకోర్టుకు తెలిపారు. దీనికి అంగీకరించిన ధర్మాసనం 14న విచారణ చేపట్టేందుకు అంగీకరించింది.