ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ప్రశంసలు- టెన్త్, ఇంటర్ పరీక్షల రద్దుపై
ఏపీలో పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు రద్దు చేస్తూ ప్రభుత్వం నిన్న నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టులో ఈ విషయంలో దాఖలైన కేసుల విచారణ సందర్భంగా ఏపీ ప్రభుత్వం వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే ప్రభుత్వం సుప్రీంకోర్టు విచారణ వాయిదా పడిన తర్వాత పరీక్షల్ని రద్దు చేస్తూ కీలక నిర్ణయం ప్రకటించింది.
ఏపీలో కరోనా సమయంలో పరీక్షల నిర్వహణపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు... నిన్న ఏపీ ప్రభుత్వం పరీక్షల్ని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసించింది. ఏపీలో పరీక్షల అంశంపై ఇవాళ సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. ఏపీ ప్రభుత్వం పరీక్షలు రద్దు చేసిన విషయాన్ని ఆయన సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
పరీక్షల నిర్వహణకు సిద్ధమైనప్పటికి అందరి మనోభావాలను దృష్టిలో ఉంచుకుని పరీక్షలను రద్దు చేశామని దుష్యంత్ దవే సుప్రీంకోర్టుకు తెలిరారు. పది రోజుల్లో హైపవర్ కమిటీ అసెస్మెంట్ స్కీమ్ను రూపొందించి జూలై 31 లోపు ఫలితాలను ప్రకటిస్తుందని సుప్రీంకు హామీ ఇచ్చారు. దేశం మొత్తం ఒక వైపు ఉన్నప్పుడు ఏపీకి ప్రత్యేక మార్గంలో వెళ్ళలనుకోవడం లేదని తాము భావించినట్లు ఆయన తెలిపారు. అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. దీంతో సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశంసించింది.