అనూహ్య మలుపు- విజయసాయిరెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు..!!
అమరావతి/న్యూఢిల్లీ: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు, పార్లమెంటరీ పార్టీ చీఫ్ వీ విజయసాయిరెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులను జారీ చేసింది. ఈ నోటీసులకు సెప్టెంబర్ 5వ తేదీ నాటికి సమాధానాలను ఇవ్వాలని ఆదేశించింది. సాయిరెడ్డితో పాటు జగతి పబ్లికేషన్స్, భారతి సిమెంట్స్ యాజమాన్యానికీ ఈ నోటీసులను ఇచ్చింది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో ఈ అనూహ్య పరిణామం చోటు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుతం జగన్ ఆస్తుల కేసులో సీబీఐ దర్యాప్తు సాగిస్తోన్న విషయం తెలిసిందే. సీబీఐ కేసుల విచారణ కొలిక్కి వచ్చేంత వరకు కూడా ఎలాంటి విచారణ జరపకూడదంటూ ఇదివరకు తెలంగాణ హైకోర్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ను ఆదేశించింది.

2021లో తెలంగాణ హైకోర్టు ఈ ఆదేశాలను ఇచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ ఈడీ అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్లో జగతి పబ్లికేషన్స్, భారతి సిమెంట్స్, విజయసాయిరెడ్డిలను ప్రతివాదులుగా చేర్చారు.
దీన్ని సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. పిటీషన్లో పొందుపరిచిన అంశాలను పరిశీలించిన తరువాత ఈ తాజా నోటీసులు జారీ అయినట్లు తెలుస్తోంది. ఈ పిటీషన్లపై విచారణను ఇద్దరు సభ్యులు గల న్యాయమూర్తుల ధర్మాసనానికి బదిలీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. మలి దశ విచారణకు వచ్చిన తరువాత దీన్ని బెంచ్కు బదలాయిస్తుందని చెబుతున్నారు.
జగన్ ఆస్తుల కేసులో సీబీఐతో పాటు తమ దర్యాప్తు కూడా ఏకకాలంలో కొనసాగించాల్సి ఉంటుందని ఈడీ అధికారుల వాదన. సీబీఐ దర్యాప్తు తేలేంత వరకూ వేచి చూడాల్సి రావడం సరికాదని అభిప్రాయపడుతున్నారు. జగతి పబ్లికేషన్స్ ఆస్తుల విడుదల విషయంలోనూ గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపైనా ఈడీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.












Click it and Unblock the Notifications