వివేకా హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఆర్.షా బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది. వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని ఆయన కుమార్తె వైఎస్ సునీత పిటిషన్ వేశారు. ఈ అంశంపై ఒకట్రెండు రోజుల్లో తీర్పు ఇవ్వనున్నట్లు జస్టిస్ ఎం.ఆర్.షా ధర్మాసనం వెల్లడించింది.
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. వేరే రాష్ట్రానికి కేసును బదిలీ చేసిన తర్వాతే సీబీఐ పిటిషన్ పై విచారణ చేస్తామని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. కేసు విచారణ డిసెంబరు 2వ తేదీకి వాయిదా వేశారు.
ఏపీలో వైఎస్ వివేకా హత్యకేసు విచారణ సవ్యంగా జరగడంలేదని, సాక్షులను నిందితులు బెదిరింపులకు గురిచేస్తున్నారని వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వేరే హైకోర్టుకు కేసును బదిలీ చేయాలని కోరింది. మరోవైపు ఈ కేసులో సీబీఐ అధికారులు తమ దర్యాప్తును కొనసాగిస్తున్నారు. పులివెందుల, కడపల్లో పర్యటించి వెళ్లారు. వివేకానందరెడ్డి హత్యజరిగిన రోజున మొదటగా ఫొటోలు తీసిన ఫొటోగ్రాఫర్ ను అధికారులు ప్రశ్నించారు. తమ దర్యాప్తులో భాగంగా వారు ఆ ఫొటోగ్రాఫర్ ను ప్రశ్నించడం నాలుగోసారి కావడం విశేషం.