వివేకా హత్య కేసు-సీబీఐ తీరుపై సుప్రీంకోర్టు సీరియస్..!
కడప : ఏపీలో నాలుగేళ్ల క్రితం జరిగిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు అంతకంతకూ ఆలస్యమవుతోంది. ఈ నాలుగేళ్లలో కరోనాతో పాటు ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న సీబీఐ.. ఇప్పటికీ దర్యాప్తును ఓ కొలిక్కి తీసుకురాలేకపోతోంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది.
వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడిగా సీబీఐ అరెస్టు చేసిన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి తరఫున ఆయన భార్య సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో సీబీఐ దర్యాప్తు నత్తనడకన సాగుతుండాన్ని ఆమె ప్రశ్నించారు. దీంతో సుప్రీంకోర్టు దీనిపై స్పందించింది. సుప్రీంకోర్టు దర్యాప్తు తీరుపై సీరియస్ అయింది. నాలుగేళ్లుగా సీబీఐ దర్యాప్తు సాగదీస్తుండటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వివేకా హత్య కేసు పురోగతిని వివరించాలని సీబీఐని ఆదేశించింది.

వివేకా హత్య కేసు దర్యాప్తు ఇంకా పూర్తికాకపోవడంపై సుప్రీంకోర్టు.. సీబీఐ అధికారులకు ప్రశ్నలు సంధించింది. దర్యాప్తు అధికారి రాంసింగ్ విచారణను ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ప్రశ్నించింది. విచారణ త్వరగా పూర్తి చేయకపోతే వేరే అధికారిని నియమించే అంశాన్ని పరిశీలించాలని సీబీఐ డైరెక్టర్ ను ఆదేశించింది. సీబీఐ అధికారి సమర్ధుడు కాకపోతే ఆయన స్ధానంలో మరో అధికారిని నియమించే అంశాన్ని పరిశీలించాలని కూడా సీబీఐ న్యాయవాదికి సూచించింది.
అయితే సీబీఐ మాత్రం విచారణ అధికారి రాంసింగ్ దర్యాప్తు సక్రమంగానే చేస్తున్నట్లు సీబీఐ న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు. ఈ వ్యవహారంలో మరిన్ని వివరాలు సమర్పించేందుకు సుప్రీంకోర్టును గడుపు కోరారు. దీంతో న్యాయస్ధానం తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications