అవినాష్ ముందస్తు బెయిల్ పిటీషన్ పై సుప్రీం కీలక నిర్ణయం..!!
వివేకా హత్య కేసులో మరో అనూహ్య ట్విస్ట్ చోటు చేసుకుంది. అవినాష్ ముందస్తు బెయిల్ పిటీషన్ పైన హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు పైన సుప్రీంకోర్టు విచారణ చేసింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల పైన వైఎస్ సునీత రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాల పైన స్టే ఇస్తూనే..అవినాష్ రెడ్డిని 24వ తేదీ వరకు అరెస్ట్ చేయవద్దని సుప్రీం ఆదేశాలు ఇచ్చింది. ఈ నెల 25న తిరిగి తెలంగాణ హైకోర్టులో అవినాష్ ముందస్తు బెయిల్ పిటీషన్ పైన విచారణ జరగనుంది.
సునీత పిటీషన్ పై విచారణ : సుప్రీంకోర్టులో అవినాష్ రెడ్డి పైన వైఎస్ సునీత దాఖలు చేసిన పిటీషన్ పైన విచారణ జరిగింది. చీఫ్ జస్టిస్ ధర్మాసనం ఈ పిటీషన్ ను విచారించింది. సునీత తన పిటీషన్ లో హైకోర్టు ఇచ్చిన తీర్పు పైన అభ్యంతరం వ్యక్తం చేసారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల చివరకి కేసు సీబీఐ విచారణ పూర్తి చేయాల్సి ఉందని వివరించారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు భిన్నంగా హైకోర్టు తీర్పు ఉందని పేర్కొన్నారు.
సీబీఐ కేసు విచారిస్తున్న సమయంలో దర్యాప్తుకు స్వేచ్చను అడ్డుకొనేలా ఈ తీర్పు ఉందని అభిప్రాయ పడ్డారు. ఈ పిటీషన్ కు సంబంధించి ఈ రోజున సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం ఎదుట సునీతారెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదించారు.

సుప్రీంకోర్టు కీలక నిర్ణయం : సునీతా న్యాయవాది విన్న సుప్రీంకోర్టు కీలక నిర్ణయం ప్రకటించింది. ఈ కేసులో హైకోర్టు అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్ పై ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపైన స్టే ఇచ్చింది. సోమవారం ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణకు నిర్ణయించింది. 24వ తేదీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని సీబీఐకి సుప్రీం స్పష్టం చేసింది.
24 సోమవారం ఈ కేసులో సుప్రీంలో మరోసారి విచారణకు రానుంది. 25న తెలంగాణ హైకోర్టు ఇప్పటి వరకు సీబీఐ అవినాష్ విచారణలో తేల్చిన అంశాలతో పాటుగా , అవినాష్ ముందస్తు బెయిల్ పైన తుది నిర్ణయం వెలువరించే అవకాశం కనిపిస్తోంది. ఈ సమయంలోనే సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించటం, సుప్రీం తాజా నిర్ణయంతో ఈ కేసు కీలక మలుపు తిరగే అవకాశం కనిపిస్తోంది.

సోమవారం వరకు అరెస్ట్ వద్దు : 24 తేదీ వరకు సుప్రీం కూడా అరెస్ట్ చేయవద్దని ఆదేశాలు ఇవ్వటం ఒక విధంగా అవినాష్ కు ఊరటనిచ్చే అంశం. అయితే, హైకోర్టులో విచారణకు ముందే సుప్రీం సునీత పిటీషన్ పైన విచారణ చేయనుంది. ఆ సమయంలో ఏం తీర్పు ఇస్తుందనేది ఇప్పుడు ఉత్కంఠకు కారణమవుతోంది. ప్రతివాదులకు సుప్రీంనోటీసులు జారీ చేసింది.
సోమవారం సాయంత్రం వరకు అవినాష్ అరెస్ట్ చేయద్దని చెప్పిన సుప్రీంకోర్టు, ఆ రోజు జరిగే విచారణలో పూర్తి స్థాయి ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది. అదే రోజున అవినాష్ తరపున వాదనలు వినిపించే ఛాన్స్ ఉంది. దీంతో, అవినాష్ వ్యవహారంలో అటు కోర్టులో చోటు చేసుకుంటున్న పరిణామాలు..సీబీఐ అడుగులు కీలకంగా మారుతున్నాయి.












Click it and Unblock the Notifications