ఏపీ సర్కార్ జీవో నంబర్ 1పై రేపు సుప్రీం విచారణ-హైకోర్టు తాత్కాలిక స్టేపై సర్కార్ అప్పీలు..
ఏపీలో కందుకూరు, గుంటూరు తొక్కిసలాట ఘటనల నేపథ్యంలో వైసీపీ సర్కార్ రోడ్లపై ర్యాలీలు, రోడ్ షోలను నిషేధిస్తూ జీవో నంబర్ 1ను తీసుకొచ్చింది. దీంతో ఈ జీవోపై విపక్షాలు మండిపడ్డాయి. ఇదే క్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ దీన్ని హైకోర్టులో సవాల్ చేశారు. విచారణ జరిపిన హైకోర్టు స్టే ఇచ్చింది. దీనిపై ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది.
జీవో నంబర్ 1పై రాష్ట్ర హైకోర్టు ఈ నెల 23 వరకూ తాత్కాలిక స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. వీటిని సవాల్ చేస్తూ వైసీపీ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై అత్యవసర విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది ప్రత్యేకంగా ప్రస్తావించారు. సీజేఐ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఈ విషయాన్ని ప్రస్తావించారు. దీంతో రేపు విచారణ చేపడతామని సీజేఐ ధర్మాసనం తెలిపింది. హైకోర్టు ఇచ్చిన తాత్కాలిక స్టే ఉత్తర్వులపై సుప్రీంకోర్టు విచారణ జరపనుంది.
జీవో నంబర్ 1పై హైకోర్టు తాత్కాలిక స్టే విధించడం చెల్లదని ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది. ప్రజా భద్రత దృష్ట్యా తాము జీవో నంబర్ 1 తీసుకొచ్చామని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అప్పీలులో పేర్కొంది. కందుకూరు, గుంటూరు ఘటనల నేపథ్యంలోనే ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు చెబుతోంది. అయితే ఈ అప్పీలును విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు.. రేపు విచారణ జరపబోతోంది. ఇందులో సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాలు కీలకంగా మారబోతున్నాయి. త్వరలో రాష్ట్రంలో లోకేష్ పాదయాత్రతో పాటు పలు టూర్లు ఉన్న నేపథ్యంలో సుప్రీం ఉత్తర్వులపై ఉత్కంఠ నెలకొంది.
జీవో నెం.1పై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీలు పిటిషన్పై రేపు సుప్రీంకోర్టులో వాదోపవాదనలు ప్రారంభం కాబోతున్నాయి.