సూరత్లో అత్యాచారం, హత్య: ఆ చిన్నారి తెలుగు బిడ్డేనా?, గుజరాత్కు ప్రకాశం దంపతులు
సూరత్/ప్రకాశం: గుజరాత్లోని సూరత్లో అత్యాచారం, హత్యకు గురైన బాలిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా మార్కాపురంలోని బాలికల హాస్టల్ నుంచి గత అక్టోబరు 11న అదృశ్యమైన మాకం చిన్ని(12)గా అనుమానిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా హత్యకు గురైన బాలికను గుర్తించేందుకు గుజరాత్ పోలీసులు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అదృశ్యమైన సుమారు ఎనిమిది వేల మంది బాలికల ఫొటోలను పరిశీలించారు.
కాగా, మృతి చెందిన బాలికకు 'చిన్ని' ఫొటోతో పోలికలు ఉండటంతో సూరత్ పోలీసులు మార్కాపురం పోలీసులకు ఈ మేరకు సమాచారమిచ్చారు. మార్కాపురం పోలీసులు వెంటనే చిన్ని తల్లిదండ్రులను పిలిపించారు. బాలిక తల్లిదండ్రులతో పాటు మార్కాపురం ఎస్సై కోటయ్య ఆధ్వర్యంలో పోలీసులబృందం సూరత్కు వెళ్లింది.
బాధిత బాలిక మృతదేహాన్ని పరిశీలించిన చిన్ని తల్లిదండ్రులు ఆమె తమ కుమార్తె అయి ఉండొచ్చనే అనుమానం వ్యక్తం చేశారు. అయితే, బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఆధార్కార్డును బట్టి మృతురాలి వేలిముద్రలు, పుట్టుమచ్చలను పోల్చి చూడగా అవి తప్పిపోయిన చిన్ని ఆనవాళ్లతో సరిపోలలేదు. మృతురాలు చిన్ని కాదని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.
అయితే, తల్లిదండ్రుల డీఎన్ఏతో సరిపోల్చి చూడాలని అక్కడి అధికారులు నిర్ణయించినట్లు జిల్లా పోలీసులకు సమాచారం అందింది. డీఎన్ఏ పరీక్షలు అనంతరం ఖచ్చితమైన వివరాలు తెలుస్తాయని ప్రకాశం జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు చెప్పారు. ఇది ఇలా ఉండగా, కేసు దర్యాప్తు ప్రగతిపై నివేదిక సమర్పించాలని గుజరాత్ రాష్ట్ర మహిళా కమిషన్ నుంచి ఆదేశాలు వచ్చినట్లు సూరత్ పోలీసు కమిషనర్ సతీశ్శర్మ తెలిపారు.
కాగా, ఏప్రిల్ 6న సూరత్ ప్రాంతంలోని ఓ క్రికెట్ మైదానానికి సమపీంలో బాధిత బాలిక మృతదేహం లభించిన విషయం తెలిసిందే. ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితులు ఆమెను దారుణంగా హత్య చేశారని ఆమెకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు తెలిపారు. ఆమె శరీరంపై 86గాయాలున్నాయని తెలిపారు. గుజరాత్ రాష్ట్రంలో ఈ ఘటనపై భారీగా నిరసనలు జరుగుతున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు.