ఇంత దారుణమా?: లైట్స్ లేక సెల్ టార్చ్తో సర్జరీ.. తేడా జరిగితే?
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాసుపత్రుల పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందో చెప్పడానికి ఇదో ఉదాహరణ. ప్రభుత్వాల పట్టి లేని తనమో.. అధికారుల నిర్లక్ష్యమో గానీ ఆపరేషన్ థియేటర్లలోనూ కనీస వసతులు కల్పించలేని పరిస్థితి. ఆఖరికి సరిపడా వెలుతురు లేక సెల్ఫోన్ టార్చ్ ఆధారంగా శస్త్ర చికిత్సలు చేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
మొబైల్ టార్చ్ వెలుతురులో ఆపరేషన్:
బుధవారం గుంటూరు ప్రభుత్వాసుపత్రి జీజీహెచ్ లో ఒక ప్లాస్టిక్ సర్జరీ చేయాల్సి ఉంది. అయితే ఆపరేషన్ థియేటర్లో ఎల్ఈడీ లైట్స్ పనిచేయకపోవడం.. సరైన వెలుతురు లేకపోవడంతో మొబైల్ ఫోన్ టార్చ్ లైటుతోనే ఆపరేషన్ పూర్తి చేశారు వైద్యులు. ఒకరు మొబైల్ టార్చ్ ఆన్ చేసి పట్టుకోగా.. మిగతా వైద్యులు సర్జరీ పూర్తి చేశారు.
ఏంటీ పరిస్థితి:
ఓవైపు జీజీహెచ్కు నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ ఆఫ్ హాస్పిటల్స్&హెల్త్ కేర్ గుర్తింపు తీసుకొస్తామన్న ప్రకటనలు.. మరోవైపు ఆపరేషన్ థియేటర్లో పట్టుమని పది ఎల్ఈడీ బల్పులు కూడా లేని దుస్థితి. ఇలా ఎన్ఏబీహెచ్ గుర్తింపు వస్తుందా?.., సరే దీని సంగతి పక్కనపెడితే.. ఆపరేషన్ థియేటర్లో కనీసం బల్బులు కూడా ఏర్పాటు చేయకపోవడమేంటి?
ఉన్న రెండు లైట్లలో ఒకటి పనిచేయట్లేదు:
ప్రస్తుతం జీజీహెచ్ ఆసుపత్రిలో 10 ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. ఇందులో ఒకటి చాలాకాలంగా నిరుపయోగంగానే ఉంది. మిగిలిన 9 థియేటర్లలో ఒకదాన్ని మూడు నెలల క్రితమే రీమోడలింగ్ చేశారు.
అక్కడి వరకు బాగానే ఉంది కానీ నాలుగు ఎల్ఈడీ లైట్లు అమర్చాల్సిన చోట కేవలం రెండింటితో సరిపెట్టారు. ఆ రెండింటిలోనూ ఒక్కటే పనిచేస్తోంది. ఈ విషయంపై ఎన్నిసార్లు ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదంటున్నారు.
తేడా జరిగితే..:
సాధారణంగా ప్లాస్టిక్ సర్జరీ కోసం ప్రత్యేకమైన ఆపరేషన్ థియేటర్స్ ఉపయోగిస్తారు. అయితే జీజీహెచ్లో అన్ని రకాల శస్త్ర చికిత్సలకు తగిననన్ని ఆపరేషన్ థియేటర్స్ అందుబాటులో లేకపోవడంతో.. అన్నింటికీ దీన్నే వాడుతున్నారు.
సాధారణ కేసులైతే పెద్ద సమస్య ఉండకపోవచ్చు కానీ.. అత్యవసర కేసులకు శస్త్ర చికిత్స చేసేటప్పుడు వెలుతురు సరిగా లేకపోతే జరగరానిది జరిగే ప్రమాదముంది. వెలుతురు లేని కారణంగా వైద్యులు కూడా అష్టకష్టాలు పడుతూ ఎలాగోలా ఆపరేషన్లు కానిచ్చేస్తున్నారు.