పెళ్ళిళ్ళపై నిఘా కళ్ళు ... ఘనంగా కళ్యాణం చేసుకోవాలనుకునే కొత్త జంటల ఆశలమీద నీళ్ళు
కరోనా నియంత్రణా చర్యల్లో భాగంగా దేశమంతా లాక్ డౌన్ విధించడంతో ప్రజలంతా దాదాపు ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రభుత్వాల ఆదేశాల ప్రకారం అన్ని రకాల శుభ కార్యక్రమాలను కూడా వాయిదా వేసుకున్న వారు ఎప్పుడెప్పుడు లాక్ డౌన్ సడలిస్తారు ఎప్పుడు పెళ్లి ఘనంగా చేసుకునే వెసులుబాటు కలుగుతుంది అని ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ వారి ఆశల మీద నీళ్ళు పోస్తూ ఇప్పట్లో అలాంటి అవకాశం లేదని చెప్పేస్తున్నాయి ప్రభుత్వాలు . ఇది కొత్తగా పెళ్లి చేసుకునే వారిని నిరాశకు గురి చేసే విషయం .
కరోనా చిత్రం ... ఫోన్ కు తాళి కట్టిన వరుడు .. కేరళలో వరుడు .. లక్నోలో వధువు
కరోనా లాక్ డౌన్ తో వివాహాలు వాయిదా
కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలు వివాహ కార్యక్రమాలను వాయిదా వేసుకోవటం మంచిదని అధికారులు సూచించారు. అయితే తప్పనిసరి పరిస్థితుల్లో ఓ నిబంధనకు అంగీకరిస్తే మాత్రం పర్మిషన్ ఇస్తామని కాస్త వెసులుబాటు కల్పించారు. పెళ్లికి కేవలం 10 మంది మాత్రమే ఉండాలని రెవెన్యూ, పోలీస్ డిపార్ట్ మెంట్ కు దరఖాస్తు చేసుకుంటే అనుమతి ఇస్తామని పేర్కొన్నారు. అంతకంటే ఎక్కువ మంది వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదని స్పష్టం చేశారు. దీంతో ఇప్పటికే కొంత మంది ఇళ్ళల్లో గుట్టు చప్పుడు కాకుండా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు.
సైలెంట్ గా సింపుల్ గా జరుగుతున్న పెళ్ళిళ్ళు
మేళతాళాలు, వేద మంత్రాలు, భాజా బజంత్రీలు లేకుండా సింపుల్ గా సైలెంట్ గా పెళ్ళిళ్ళు జరిగిపోతున్నాయి. ఇక కొంత మంది ఆన్ లైన్ లో పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఇక తాజాగా కొన్ని రాష్ట్రాల్లో మే 3 తర్వాత కూడా శుభకార్యాలకు అధికారిక అనుమతి తీసుకోవాలని చెప్తున్నారు అధికారులు . మే 3 తర్వాత ఒకవేళ లాక్ డౌన్ నిబంధనలు సడలించినా సరే పెళ్ళిళ్ళ విషయంలో మాత్రం కఠిన నిబంధనలు పాటించాల్సిందే అంటున్నారు. పెళ్లి కొడుకు , పెళ్లి కూతురు తరపున కేవలం 10 మందికి మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు .
లాక్ డౌన్ సడలించినా సరే పెళ్ళిళ్ళపై ఆంక్షలు
ఇక పెళ్లి చేసుకునే వారి వివరాలను రెవెన్యూ అధికారులు సంబంధిత పోలీస్ స్టేషన్ లకు పంపిస్తారు. ఇక పోలీసులు వారి పెళ్లిపై నిఘా పెడతారు. 10 మంది కంటే ఎక్కువ మంది ఉంటె మాత్రం ఇబ్బంది పడాల్సి వస్తుంది. అంతే కాదు పెళ్ళిలో సామాజిక దూరం పాటించాలి . నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు కూడా నమోదు చేస్తారు . ఇక ఈ పెళ్ళిళ్ళలోనూ ఫేస్ కు మాస్కులు , అలాగే శానిటైజర్లు తప్పనిసరిగా వాడాలి . ఇలా పెళ్లి చెయ్యటం ఇష్టం లేని పెద్దలు పరిస్థితులు సద్దు మణిగే వరకు వేచి చూద్దాం అనుకుంటున్నారు. కానీ కాబోయే జంట మాత్రం మా వల్ల కాదు అని తెగ ఇబ్బంది ఫీల్ అవుతున్నారు. ఇలా సైలెంట్ గా 10 మంది మధ్య పెళ్లి చేసుకోలేక , పెళ్లి పోస్ట్ పోన్ చేసినా ఎప్పటి వరకు ఈ కరోనా వైరస్ ప్రభావం ఉంటుందో తెలీక తెగ సతమతమవుతున్నారు .
ఘనంగా కళ్యాణం ఇప్పట్లో సాధ్యం కాని పని
ఇక ఈ నేపధ్యంలో కాస్త ఆలస్యం అయినా సరే ఆకాశమంత పందిరి వేసి భూదేవి అంత మండపంలో ఘనంగా బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి చేసుకోవాలని కలలు కన్నా వారు ఆ కలలను నెరవేర్చుకునే పరిస్థితి అయితే ఇప్పట్లో లేదు. కరోనా మహమ్మారి పూర్తిగా తగ్గుముఖం పడితేనే మళ్ళీ మానవ జీవనం , వివాహాది శుభకార్యాలు సాఫీగా అనుకున్న విధంగా సాగేది. అప్పటి వరకు అందరికీ కష్టాలు తప్పవు. ముఖ్యంగా పెళ్లి మీద ఎన్నో కలలు కన్న యువతకు ఈ సమయంలో పెళ్లి , ఇంత నిఘా మధ్య ఇన్ని ఆంక్షల నడుమ జరుపుకునే పెళ్లి నిజంగా బాధాకరమే .
Recommended Video