కొద్దిరోజుల్లో: రాజధానిపై బాబు, హైద్రాబాద్లో ఇష్టంలేదని
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఎక్కడ ఏర్పాటు కానున్నదనే ఊహాగానాలు, ఉత్కంఠకు పది, పదిహేను రోజుల్లో తెరవేస్తానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. దీనిపై కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ నివేదిక వెలువడిన వెంటనే మంత్రివర్గ సమావేశంలో స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామన్నారు.
విజయవాడలో పలు కార్యక్రమాల్లో శనివారం పాల్గొన్న చంద్రబాబు రాజధాని విషయమై ఎక్కడా స్పష్టమైన ప్రకటన చేయలేదు. ప్రపంచ గుర్తింపు పొందే విధంగా రాష్ట్రంలో నూతన రాజధాని నిర్మిస్తానని, అసలు రాజధానిని చూడటానికే ప్రజలు వచ్చేలా రూపకల్పన చేస్తున్నామన్నారు.
అయితే ప్రస్తుతం రాష్ట్రంలో 15.6వేల కోట్ల రూపాయల లోటు ఉన్నదంటూ, నిధుల కొరతను అధిగమించాల్సి ఉందన్నారు. నూతన రాజధాని ఏర్పాటులో ఉద్యోగుల పాత్ర కీలకమైనదని, ఉన్న వనరులను ఉపయోగించుకుని సంపద పెంచుకోవాల్సి ఉందన్నారు.

తనకు కూడా హైదరాబాద్లో ఉండి పరిపాలన చేయడం ఇష్టం లేదని, అందుకే ఎన్ని రోజులు హైదరాబాద్లో ఉండాలి, ఎన్ని రోజులు వెలుపల ఉండాలనే దానిపై ఆలోచన చేస్తున్నట్టు చెప్పారు. అలాగే ఏయే కార్యాలయాలను ఒకదాని వెంట మరొకటిగా హైదరాబాద్ నుంచి ఖాళీ చేయవచ్చనే విషయాన్నీ పరిశీలిస్తున్నట్టు చెప్పారు.
రాజధాని నిర్మాణం కోసం శిలాన్యాసం తరహాలో ప్రతి ఒక్కరూ ఒక ఇటుక లేదా తగిన విలువతో ఆర్థిక సాయం అందిస్తే రాజధాని నిర్మాణం విషయంలో అధైర్యపడాల్సిన అవసరం ఉండదన్నారు. రాష్ట్రాభివృద్ధికి ఎంతగానో శ్రమిస్తుంటే కొందరు అవరోధాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని, అయితే తాను దేనికీ భయపడే వ్యక్తిని కాదన్నారు.
రాష్ట్ర విభజన సమయంలో తన జీవితంలో ఎన్నడూ లేనివిధంగా కొన్ని రోజులపాటు కంటిపై కునుకు లేకుండా పోయిందని, ఈ రాష్ట్రం ఏవౌతుందోనని మదనపడ్డానని ఆవేదనతో చెప్పుకొచ్చారు. పైగా కొందరు స్వార్థపరులు రెండు కళ్ల సిద్ధాంతం, సమన్యాయం అంటూ తనను ఎద్దేవా చేస్తూ పరిహసించారన్నారు. అయితే విభజన సమయంలో బిజెపి ఇచ్చిన భరోసా తనకు కొండంత బలాన్ని చేకూర్చిందన్నారు.












Click it and Unblock the Notifications