పరిషత్ పోరుపై వైసీపీ యూటర్న్- నిమ్మగడ్డకు చుక్కలు-రిటైర్మెంట్ను పొడిగిస్తారా ?
ఏపీలో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో క్లీన్స్వీప్ చేసి ఊపు మీదున్న వైసీపీ.. ఇప్పుడు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు కూడా పూర్తి చేయాలనే డిమాండ్ మొదలుపెట్టింది. నిన్న మొన్నటివరకూ ఎంపీటీసీ, జడ్పీటీసీ పోరుకు పావులు కదిపిన ఎస్ఈసీ నిమ్మగడ్డ ఇప్పుడు రిటైర్మెంట్కు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో పరిషత్ పోరుకు ఆసక్తిగా లేనట్లు కనిపిస్తోంది. హైకోర్టులో దాఖలైన కేసులతో పాటు ఇతర అంశాల్ని దృష్టిలో ఉంచుకుని ఇక తన హయాంలో ఎన్నికలు సాధ్యం కావనే నిర్ణయానికి వచ్చేశారు. అయితే అనూహ్యంగా మున్సిపల్ తీర్పుతో హ్యాపీగా ఉన్న వైసీపీ ఇప్పుడు పరిషత్ పోరు పెట్టాల్సిందేనని ఆయనపై ఒత్తిడి పెంచుతోంది.

పరిషత్ పోరుపై ఎడతెగని ఉత్కంఠ
ఏపీలో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు ముగిశాక ఇక మిగిలున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపైనే అందరి దృష్టీ పడింది.
ఎంపీటీసీ, జడ్పీటీసీ స్ధానాల్లో ఏకగ్రీవాల్ని ఆమోదించాల్సిందేనని హైకోర్టు ఇచ్చిన తీర్పుతో మిగిలిన స్ధానాల్లో ఎన్నికలకు న్యాయపరమైన చిక్కులు కూడా తొలగిపోయాయి. దీంతో ఎన్నికలు జరిపించాల్సిందేనన్న డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి. అయితే ఎన్నికలను గతంలో ఆపిన చోట నుంచి కాకుండా కొత్త నోటిఫికేషన్ ఇచ్చి జరిపించాలని విపక్షాలు ఎస్ఈసీని కోరుతున్నాయి. అలా జరగకపోతే వారు తిరిగి న్యాయస్ధానాల్ని ఆశ్రయించే అవకాశం ఉంది. అప్పుడు కేసులు తేలితే కానీ ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదు. దీంతో ఎస్ఈసీ తీసుకోబోయే నిర్ణయం కూడా కీలకంగా మారిపోయింది.

పరిషత్ పోరుపై వైసీపీ యూటర్న్
నిన్న మొన్నటి వరకూ మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత జరగాల్సిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ విషయంలో వైసీపీ సర్కారు అంతగా ఆసక్తిగా లేదు. అదే సమయంలో ప్రభుత్వం చేపట్టాల్సిన జిల్లాల విభజన కూడా పెండింగ్లో ఉంది. ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే జిల్లాల విభజన తర్వాత కొత్త సమస్యలు తప్పవు. కాబట్టి జిల్లాల విభజన తర్వాతే వైసీపీ ఎన్నికలకు వెళ్తుందని అంతా భావించారు. కానీ వైసీపీ మాత్రం వైఖరి మార్చుకుంది. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల విజయాలతో తెచ్చిన ఊపులోనే పరిషత్ పోరు కూడా ముగించేస్తే ఇక ఎన్నికలపై నుంచి ప్రభుత్వ పాలనపైకి దృష్టిపెట్టవచ్చని భావిస్తోంది. అందుకే పరిషత్ పోరు పెట్టాలని ఎస్ఈసీ నిమ్మగడ్డపై ఒత్తిడి పెంచుతోంది.

ముంచుకొస్తున్న నిమ్మగడ్డ రిటైర్మెంట్
వాస్తవానికి రెండు నెలల క్రితం ఏపీలో స్ధానిక సంస్ధలను ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించేందుకు వైసీపీ అస్సలు ఇష్టపడలేదు. నిమ్మగడ్డ రిటైర్ అయ్యాకే ఎన్నికలంటూ మంత్రులు, ఎంపీలు నేతలకు చెప్తూ వచ్చారు. కానీ ఓసారి పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు ముగిశాక వైసీపీలోనూ ఆయనపై ఎక్కడలేని భరోసా వచ్చేసింది. దీంతో ఇప్పుడు పరిషత్ పోరునూ ముగించి వెళ్లాలని నిమ్మగడ్డపై ప్రభుత్వం ఒత్తిడి పెంచుతోంది. అయితే ఈ నెలాఖరుతో నిమ్మగడ్డ పదవీకాలం ముగిసిపోనుంది. దీంతో ఎన్నికలపై సస్పెన్స్ నెలకొంది.

నిమ్మగడ్డ పదవీకాలం పొడిగిస్తారా ?
పరిషత్ ఎన్నికలు నిర్వహించేందుకు నిమ్మగడ్డ చేతిలో ప్రస్తుతం మిగిలున్నది రెండు వారాల కంటే తక్కువ సమయం. ఇందులోనూ రేపు మున్సిపల్ కార్పోరేషన్ల మేయర్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఛైర్మన్ల ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అవి సజావుగా పూర్తి చేసి ఈ నెల 19 నుంచి 22 వరకూ నాలుగు రోజుల పాటు సెలవుపై వెళ్లేందుకు నిమ్మగడ్డ సిద్ధమవుతున్నారు. అంటే 23న ఆయన తిరిగి బాధ్యతల్లోకి వస్తారు. అప్పటి నుంచి లెక్కేసుకుంటే కేవలం 9 రోజుల సమయం మాత్రమే ఉంటుంది. ఇంత హడావిడిగా ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదు. దీంతో నిమ్మగడ్డ పదవీకాలాన్ని అసాధారణంగా పొడిగించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుందా ? గతంలో ఆయన కోల్పోయిన రెండు నెలల పదవీకాలాన్ని ఇక్కడ భర్తీ చేస్తున్నట్లు ఆర్డినెన్స్ ఇస్తారా ? గవర్నర్ నిర్ణయం ఎలా ఉండబోతోంది ? ఒకవేళ ప్రభుత్వం అదే నిర్ణయం తీసుకుంటే దాన్ని గవర్నర్ ఆమోదిస్తారా అన్నది తేలాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications