చంద్రబాబు వల్లే వానల్లేవు: శారదా పీఠాధిపతి వ్యాఖ్య
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచి వర్షాలు కురవడం లేదని విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు. గతంలో కూడా చంద్రబాబు హయాంలో పరిస్థితి ఇలాగే ఉన్నదని ఆయన అన్నారు.
వర్షాలు రాకపోవడానికి కారణం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఉదయం కాకుండా సూర్యస్తమయం తర్వాత చేశారనీ, అది మంచిది కాదని అన్నారు. గతంలో ఇలా సూర్యాస్తమయం తర్వాత ప్రమాణం చేసినవారు దుష్ఫలితాలు పొందారని గుర్తు చేశారు.
ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం చేసిన రోజునాడే ఐదుగురు చనిపోయారని, ప్రతీరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట జనం చనిపోతూనే ఉన్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. స్వరూపానంద గాజువాకలోని శ్రీ షిర్డీసాయిబాబా ఆలయంలో భక్తులనుద్దేశించి ప్రసంగిస్తూ పైవిధంగా వ్యాఖ్యానించారు.
మరోవైపు సిపిఎం పొలిట్బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు సైతం చంద్రబాబు సెంటిమెంట్ గురించి మాట్లాడారు. టిడిపి అధినేత చంద్రబాబు అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కరవు తాండవిస్తుందనే నమ్మకం ఉందని అన్నారు. గతంలో కూడా ఆయన 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కరవుకాటకాలతో రాష్ట్రం అల్లాడిందనీ, ఇపుడు ఏపీలో అదే పరిస్థితి కనబడుతోందని రాఘవులు అన్నారు.