ఈ ఏడాది ఎండలు ఎక్కువే: మళ్లీ వార్తల్లోకి స్వరూపానందేంద్ర సరస్వతి
అమరావతి: ఈ ఏడాది వర్షాలు తక్కువగా కురుస్తాయని, ఎండలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి వ్యాఖ్యానించారు. పెందుర్తి శారదాపీఠంలో మహా కుంభాభిషేకం నిర్వహించనున్న నేపథ్యంలో ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు.
సెక్యులరిజం పేరుతో దేశంలోని హిందూ శాస్త్రాలు మోసానికి గురవుతున్నాయని ఆయన అన్నారు. ఈ ఏడాది వర్షాలు తక్కువగా కురుస్తాయని, ఎండలు ఎక్కువగా కాసే ప్రమాదం ఉందని ఆయన తెలిపారు. దీనివల్ల భూకంపాలు, అగ్ని ప్రమాదాలు సంభవించే ఆస్కారం ఉందన్నారు.
ఈ నెల 14 నుంచి 18 వరకు పెందుర్తి శారదాపీఠంలో మహా కుంభాభిషేకం నిర్వహిస్తున్నామని చెప్పిన ఆయన, దేవాలయాల సనాతన సాంప్రదాయాన్ని, శాస్త్రాలను అమలు పరచడానికి ప్రజాప్రతినిధులు ఆసక్తి చూపించడం లేదని పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే ఏపీ మంత్రి శిద్ధా రాఘవరావు చేతుల మీదుగా ఫిబ్రవరి 17న వేద పండితులకు సత్కారం, సువర్ణ కంకర ధారణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు స్వరూపానందేంద్ర సరస్వతి వెల్లడించారు. గతంలో కూడా స్వరూపానందేంద్ర సరస్వతి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు దేవుడి ఆశీస్సులు ఉండవనే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఆధ్యాత్మిక విషయాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు పీఠాధిపతులు, మఠాధిపతులను సంప్రదించడం లేదని అన్నారు. హైందవ మతాలకు మంచి జరుగుతుందని ఎన్నికలప్పుడు ఈ ప్రభుత్వాలను గెలిపించేందుకు రోడ్ల మీదకు వచ్చామని స్వరూపానందేంద్ర సరస్వతి చెప్పారు.