మరణించిన చాంద్ మియాను ఎలా కొలుస్తారు: షిర్డీ సాయిపై వెనక్కి తగ్గని స్వరూపానంద
ఒంగోలు: షిర్డీ సాయిబాబాను పూజించడాన్ని తాను వ్యతిరేకిస్తూ చేసిన వ్యాఖ్యలపై ద్వారకా పీఠాధిపతి స్వరూపానంద స్వామి ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తన వ్యాఖ్యలపై షిర్డీ సాయి బాబా భక్తులు ఆందోళనలకు దిగిన నేపథ్యంలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. మరణించిన చాంద్ మియాను దేవుడిగా ఎలా కొలుస్తారని ఆయన ప్రశ్నించారు.
సాయిబాబాను త్రిమూర్తులుగా కొలుస్తున్నారని, అది సరి కాదని ఆయన అన్నారు. చాంద్ మియా మరణించిన తర్వాత ఆయన్నే దేవుడిగా పూజిస్తున్నారని, శాస్త్రప్రమాణాలు లేకుండా ఎలా పూజిస్తారని స్వరూపానద అన్నారు. చనిపోయిన వ్యక్తిని పూజించడాన్ని రామ్ చరత్ మానస్ కూడా తప్పు పట్టిందని ఆయన గుర్తు చేశారు.
సాయి మందిరాలను తొలగించి సుదర్శన చక్రాలను పూజించాలని ఆయన చెప్పారు. ప్రజలు విష్ణుమూర్తిని పూజించవచ్చు గానీ సాయిని కాదని ఆయన అన్నారు. కృష్ణుడి స్థానంలో పిల్లనగ్రోవి పట్టుకున్న సాయిని ఎలా కొలుస్తారని ఆయన అడిగారు. చాంద్ మియాను విష్ణువుగా ఎలా పూజిస్తారని కూడా ప్రశ్నించారు. షరిడీ సాయిని పూజిస్తే అరిష్టమని ఆయన అన్నారు.

చర్చకు రావచ్చు...
తమతో విభేదించేవారు చర్చ చేయవచ్చు గానీ గొడవ ఎందుకని ఆయన అడిగారు. తనతో విభేదించేవారు తమతో చర్చకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. హిందూ బాలలకు పాఠశాలల్లో రామాయణం, గీత బోధించాలని, అప్పుడే మహిళలపై దాడులు ఆగుతాయని ఆయన అన్నారు. గోవధలు ఆగిపోవాలన్నదే తమ ఉద్దేశమని, మోడీ ప్రధాని అయితే గోహత్యలు ఆగుతాయని అనుకున్నామని, కానీ అవి ఆగకపోవడం విచారకరమని అన్నారు.
అయోధ్యలో రామమందిరం నిర్మించాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు. అయోధ్యకే రాని బాబర్ అక్కడ మసీదు ఎలా నిర్మించారని అన్నారు. సాధుసంతులే రామమందిరం నిర్మిస్తారని చెప్పారు. పాకిస్తాన్ నుంచి రవాణా అవుతున్న డ్రగ్స్ యువతను దెబ్బ తీస్తున్నాయని ఆయన అన్నారు.
రిజర్వేషన్లు ఉండకూడదు..
రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, తదితర ప్రాంతాల్లో రిజర్వేషన్ల కోసం ఆందోళనలను కొనసాగుతున్నాయని అంటూ ఏ వర్గానికి కూడా రిజర్వేషన్లు ఉండకూడదని స్వరూపాదనంద అభిప్రాయపడ్డారు. కులం, వర్గం ఆధారంగా రిజర్వేషన్లు ఉండకూడదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications