స్వైన్ ఫ్లూ మహమ్మారి: తెలుగు రాష్ట్రాల్లో ముగ్గురు మృతి
హైదరాబాద్: స్వైన్ మహమ్మారి తెలుగు రాష్ట్రాలను గజగజలాడిస్తోంది. తాజాగా, సికింద్రాబాదులోని గాంధీ ఆస్పత్రిలో మంగళవారంనాడు మరో వ్యక్తి స్వైన్ ఫ్లూతో మరణించాడు. అతను హైదరాబాదులోని పటాన్చెరుకు చెందిన శంకర్. స్వైన్ఫ్లూ మహమ్మారి కారణంగా సోమవారంనాడు గాంధీ ఆస్పత్రిలో ఇద్దరు మృతిచెందారు. మృతుల్లో ఒకరు కీసరకు చెందినవారు కాగా మరొకరు అనంతపురం జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. 9 మంది చిన్నారులతో సహా ౩౩ మందికి పాజిటీవ్ గా నిర్దారించారు. మరో 36 మందికి స్వైన్ఫ్లూ లక్షణాలు ఉన్నట్టు తెలిపారు.
చిత్తూరు జిల్లా పంగునూరుకు చెందిన ఓ ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయుడు స్వైన్ ఫ్లూతో మరణించాడు. అతను బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా కీసర మండలం దమ్మాయిగూడెం గ్రామంలో స్వైన్ ఫ్లూతో ఓ వ్యక్తి మరణించాడు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇప్పటి వరకు స్వైన్ ఫ్లూ వ్యాధితో 36 మంది దాకా మరణించినట్లు సమాచారం. సికింద్రాబాదులోని గాంధీ ఆస్పత్రిలో ఓ ఖైదీ స్వైన్ ఫ్లూ వ్యాధితో మరణించిన విషయం తెలిసిందే. అయితే, అతను గుండెపోటుతో మరణించాడని అధికార వర్గాలు అంటున్నాయి. హైదరాబాదులోని చర్లపల్లి జైలులో ఇద్దరు ఖైదీలు స్వైన్ఫ్లూతో బాధపడుతుండగా ఓ ఖైదీ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో తోటి ఖైదీల్లో భయాందోళనలు మొదలయ్యాయి. మృతుడు ఓ హత్య కేసులో నిందితుడు.
విశాఖపట్నంలో స్వైన్ ఫ్లూ పాజిటివ్ కేసులు నాలుగుకు చేరుకున్నాయి. విశాఖపట్నంలో స్వైన్ ఫ్లూ వ్యాధి విస్తరిస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో స్వైన్ ఫ్లూ వ్యాధి విజృంభిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ మహమ్మారి విస్తరిస్తోంది. గాంధీ ఆస్పత్రిలో ప్రతి రోజూ ఇద్దరి చొప్పున మరణిస్తున్నారు.
హైదరాబాదులోని చెస్ట్ ఆస్పత్రిలో ఒకరికి స్వైన్ ఫ్లూ వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయింది. ఉస్మానియా, ఫీవర్ ఆస్పత్రులకు కూడా స్వైన్ వ్యాధిగ్రస్తులు వస్తున్నారు.