విశ్వకాంత్: బ్రేక్ఫాస్ట్ కోసం వెళ్లి సిడ్నీ కేఫ్లో చెర
హైదరాబాద్: భార్యాపిల్లలకు బ్రేక్ఫాస్ట్ తెస్తానని చెప్పి సిడ్నీలోని లిండ్ కేఫ్కు వెళ్లిన ఇన్ఫోసిస్ టెక్కీ విశ్వనాథ్ అంకిరెడ్డి ఉగ్రవాదికి బందీగా చిక్కాడు. ఇప్పుడే వస్తానని భార్య శిల్పారెడ్డికి చెప్పి వెళ్లిన అతను 16 గంటల పాటు కేఫ్లోనే ఉండాల్సి వచ్చింది. చివరకు కమెండోలు అతన్ని చెర నుంచి విడిపించారు. ఇన్ఫోసిస్ వెస్ట్పాక్ బ్యాంకులో సీనియర్ ప్రాజెక్టు మేనేజర్గా పనిచేస్తున్న విశ్వకాంత్ తన భార్య శిల్ప, కూతురు అక్షయకు బ్రేక్ఫాస్ట్ చేయడానికి కేఫ్కు వెళ్లాడు.
విశ్వకాంత్ అంకిరెడ్డి కుటుంబ సభ్యులు గుంటూరులోని సంపత్ నగర్ కాలనీలో ఉంటారు. అతను చెర నుంచి విడుదల కావడంతో కుటుంబ సభ్యులు ఆనందడోలికల్లో తేలియాడారు. విశ్వకాంత్ క్షేమంగా బయటపడడంతో ఆయన తల్లిదండ్రులు సులోచన, ఈశ్వర్ రెడ్డి, బంధువులు, మిత్రులు ఆనందం వ్యక్తం చేశారు.
కమెండోల ఆపరేషన్ ముగిసిందని, విశ్వకాంత్ అంకిరెడ్డి క్షేమంగా బయటపడ్డాడని భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సోమవారం రాత్రి ప్రకటించారు. కమెండోలు కేఫ్ను చుట్టుముట్టి లోనికి వెళ్లి ఆపరేషన్ చేపట్టిన సమయంలో విశ్వకాంత్ అంకిరెడ్డి లోపలి నుంచి బయటకు పరుగెత్తుతూ రావడం టీవీ చానెళ్లలో కనిపించింది. కొంత దూరం పరుగెత్తిన తర్వాత అతను నేలపై పడిపోయాడు. కమెండోలు అతన్ని లేపి నడిపించారు.
అతను పరుగెత్తుతున్నప్పుడు కాస్తా ఇబ్బంది పడినట్లు వీడియో ఫుటేజీల్లో కనిపించింది. విశ్వకాంత్ సురక్షితంగా బయటకు రావడంతో కుటుంబ సభ్యులు స్వీట్లు పంచి సంబరం చేసుకున్నారు. విశ్వకాంత్ విడదలైన తర్వాత ఈశ్వర్ రెడ్డి తన కోడలు శిల్పారెడ్డితో మాట్లాడారు.