అలా అంటే కుదరదు: టి నేతలు, ఆ తర్వాత చెప్తా: బొత్స
హైదరాబాద్: సీమాంధ్ర ప్రాంత కాంగ్రెసు నేతలతో సీమాంధ్ర సమస్యల పైనే చర్చించాలని, అలా కాకుండా మళ్లీ సమైక్యాంధ్ర అంటే కుదరదని తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్టీ నేతలు ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు సోమవారం సూచించారు. వారు మినిస్టర్స్ క్వార్టర్స్లో బొత్సతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారి మధ్య పలు అంశాలు చర్చకు వచ్చాయి.
పదకొండు అంశాల పైన మంత్రుల బృందానికి(జివోఎం) నివేదిక ఇవ్వాలని, వాటిని సిద్ధం చేయాలని వారు బొత్సకు సూచించారు. మీరు ఇచ్చిన నివేదికను జివోఎంకు పంపిస్తామని బొత్స వారికి చెప్పారు. సాయంత్రం సీమాంధ్ర నేతలతో భేటీలో సీమాంధ్ర సమస్యల పైనే చర్చించాలన్నారు. మళ్లీ సమైక్యాంధ్ర అనవద్దన్నారు.
ఒకే నివేదిక ఇవ్వాలని, సీమాంధ్ర సమస్యలు ప్రస్తావించాలని కోరారు. తమతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడక పోవడం అవమానంగా భావిస్తున్నామని తెలంగాణ ప్రాంత నేతలు ఆవేదన, ఆక్రోశం వ్యక్తం చేశారు.
భేటీ అనంతరం బొత్స విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెసు పార్టీ తీసుకునే నిర్ణయాన్ని తాము మంగళవారం ప్రకటిస్తామని చెప్పారు. నేతలతో జరిగిన చర్చను ప్రస్తుతం బయట పెట్టనన్నారు. ముఖ్యమంత్రి, సీమాంధ్ర నేతలతో భేటీ అయిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తానన్నారు.
ప్రాంతాల వారీగా వేర్వేలు సమావేశాలు ఏర్పాటు చేయడంపై వివరణ ఇస్తూ.. ఇరు ప్రాంతాల ప్రజల అభిప్రాయాలు గౌరవిస్తున్నందుకే వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.