గిలగిల!: కిరణ్తో టి బ్యాటింగ్: రివర్స్తో జగన్ యుటర్న్
హైదరాబాద్: ఆఖరు బంతి వరకు ఆట ముగియదన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలపై తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు ఓ వైపు మండిపడుతుండగా మరోవైపు రాజీనామాల దిశగా అడుగేసిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు ఆ వ్యూహం తిరగబడటంతో వెనక్కి తగ్గారు. రెండు రోజులుగా కిరణ్ వ్యాఖ్యలు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసన సభ్యుల రాజీనామాల అంశం చుట్టూ రాష్ట్ర రాజకీయం తిరుగుతోంది.
రెండు రోజుల క్రితం కిరణ్ రాజ్యసభ టివికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చివరి బంతి వరకు ఆట ముగియదన్న విషయం తెలిసిందే. దీనిపై తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు నిప్పులు చెరుగుతున్నారు. ప్రతిపక్ష నేతల విషయాన్ని పక్కన పెడితే సొంత పార్టీ నేతలు కిరణ్ పైన మండిపడుతున్నారు. మ్యాచ్ ముగిసిందని, ఆడడానికి బాల్స్ లేవని పిసిసి మాజీ చీఫ్, శాసన మండలి సభ్యుడు డి శ్రీనివాస్ తనదైన శైలిలో ఎద్దేవా చేశారు.
కిరణ్ కేబినెట్ మంత్రులు కూడా ఆయనను వదలలేదు. సిడబ్ల్యూసి నిర్ణయంతోనే మ్యాచ్ ముగిసిందని మంత్రి శ్రీధర్ బాబు చెప్పగా, ఉద్యమం మొదలైనప్పుడు మ్యాచ్ ప్రారంభమైందని సిడబ్ల్యూసి నిర్ణయంతో మ్యాచ్ ముగిసిందని, ఇక మైదానం ఖాళీ చేయడమే మిగిలి ఉందని మరో మంత్రి సునితా లక్ష్మా రెడ్డి వ్యాఖ్యానించారు. ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు వి హనుమంత రావు కూడా కిరణ్ను వదల్లేదు.
ఇక తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ తెలుగుదేశం పార్టీ, తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి నాయకులు ధీటుగా స్పందించారు. తెలంగాణకు నాలుగు వందల మంది ఎంపీల మద్దతు ఉందని ఒక బంతి ఉన్నా సిక్సర్కు మించి కొట్టలేమని, ఒఖ్క బంతితో ఎన్ని పరుగులు తీస్తారని ఎద్దేవా చేశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు శోభా నాగి రెడ్డి చివరి బంతి వరకు నిరీక్షణ ఎందుకని ప్రశ్నించారు.
జగన్కు యు టర్న్ తిప్పలు
వైయస్ జగన్మోహన్ రెడ్డి జైలు నుండి విడుదల కావడాన్ని కొందరు సీమాంధ్ర కాంగ్రెసు నేతలు కూడా స్వాగతించారు. సమైక్యవాదం ఎత్తుకున్న జగన్ను విడుదలను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ఇటీవల సమైక్యవాదంతో ముందుకు వెళ్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ జగన్ విడుదల అనంతరం మరింత దూకుడు పెంచాలని భావించింది. అందులో భాగంగా సమైక్యాంధ్ర కోసం రాజీనామాలంటూ తెరలేపింది. అయితే, ఈ వ్యూహం అనూహ్యంగా బెడిసికొట్టిందంటున్నారు.
అప్పటికే కాంగ్రెసు పార్టీతో కుమ్మక్కయినందువల్లనే జగన్కు బెయిల్ వచ్చిందని ప్రతిపక్షాలు విమర్శించాయి. తాజాగా రాజీనామాల అంశం ప్రధానంగా చర్చనీయాంశమైంది. అధిష్టానంతో కుమ్మక్కులో భాగంగా అసెంబ్లీలో తెలంగాణ తీర్మానాన్ని గట్టెక్కించేందుకే జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ ప్రచారంతో గురువారం రాజీనామాలు చేయాలనుకున్న ఆ పార్టీ ఎమ్మెల్యేలు యూ టర్న్ తీసుకున్నారు.
అసెంబ్లీలో తీర్మానం ఓడించేందుకు ఎమ్మెల్యేలు రాజీనామా చేయవద్దని ఎపిఎన్జీవోలు సైతం చెబుతున్నారని అలాంటప్పుడు వారు రాజీనామాకు ఎందుకు ముందడుగు వేస్తున్నారని టిడిపి ప్రశ్నిస్తోంది. రాజీనామాలపై యూ టర్న్ తీసుకున్న జగన్ పార్టీ తాజాగా అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలకు పట్టుబడుతోంది. దీని పైనా విమర్శలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తే టి ప్రక్రియ వేగమవుతుందని అలాంటప్పుడు ఆ పార్టీ ఎందుకు డిమాండ్ చేస్తోందో చెప్పాలని కొందరు ప్రశ్నిస్తున్నారు.