సోనియాకు మాటిచ్చావ్, నిలబెట్టుకో: కెసిఆర్కు ఎంపీలు
హైదరాబాద్/న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు పొన్నం ప్రభాకర్, సురేష్ షెట్కార్, రాజయ్య తదితరులు అన్నారు. శనివారం రాత్రి వారు విలేకరులతో మాట్లాడారు. ఎంపీలుగా తాము క్షేత్రస్థాయి భావాలను పార్లమెంటుకు తీసుకొచ్చి తెలంగాణ అంశం తీవ్రతను దేశానికి చాటి చెప్పామని అన్నారు.
సోనియాగాంధీ క్లిష్టమైన నిర్ణయం తీసుకోవటంతో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు సాధ్యమయ్యిందన్నారు. ఈ చారిత్రక ఘటనలో భాగమైనందుకు 15వ లోక్సభ ఎంపీలుగా తమ జన్మ ధన్యమైందని, తెలంగాణ ఏర్పాటు తమ జీవితంలో మరపురాని ఘట్టమని పొన్నం సంతోషం వ్యక్తం చేశారు.
పార్లమెంటులో అంతరాయాలు సృష్టించడం ద్వారా ఎవరినైనా ఇబ్బంది పెడితే క్షమించాలన్నారు. తమ ప్రాంత ప్రయోజనాల కోసమే పాటుపడ్డామని, ఈ క్రమంలో సీమాంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బతీస్తే మన్నించాలని అన్నారు. లగడపాటి రాజగోపాల్ రాజకీయ సన్యాసం స్పందిస్తూ.. రాజకీయ సన్యాసం తీసుకుంటామంటూ కఠిన నిర్ణయాలు ఎప్పుడూ తీసుకోకూడదన్నారు. ఆ ప్రాంత ప్రజల ఆకాంక్షల కోసమే ఆయన పోరాడాడని, ఇప్పుడు ఆ ప్రజలే ఆయన్ను గుర్తించాలన్నారు.
జైపాల్ రెడ్డిపై గద్దర్
కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి పైన గద్దర్ హైదరాబాదులో మండిపడ్డారు. జైపాల్ రెడ్డిని హైదరాబాదుకు వచ్చి జై తెలంగాణ అనాలని అడిగానని, అందుకు ఆయన తాను కేంద్రమంత్రినని, అలా అననని చెప్పారని, ఇప్పుడేమో జై జై తెలంగాణ అంటున్నారని విమర్శించారు.