తెలంగాణ 'ఫాస్ట్' కమిటీ : కెసిఆర్పై రావెల కిశోర్ ఫైర్
హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్ స్థానంలో ఫాస్ట్ పథకం ద్వారా విద్యార్థులు ప్రయోజనం పొందేందుకు 1956కు ముందు తెలంగాణలో నివసించినవారే అర్హులని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు జీవో కూడా విడుదల చేసింది. ఈ ధ్రువీకరణ పత్రాలను రెవెన్యూ శాఖ జారీ చేస్తుందని ఉత్తర్వులో వెల్లడించింది. ఫాస్ట్ పథకం విధివిధానాల రూపకల్పనకు ఐదుగురు అధికారులతో ప్రభుత్వం కమిటీని నియమించింది.
తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై ఆంధ్రప్రదేశ్ మంత్రి రావెల కిశోర్ కుమార్ తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన స్థానికత జీవో రాజ్యాంగానికి వ్యతిరేకమని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్పై తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేయాలని కోర్టులో ధర్మపోరాటం చేస్తామని ఆయన చెప్పారు.
రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన నిర్ణయాలు తీసుకోవద్దని తాము తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును కోరుతున్నట్లు ఆయన తెలిపారు. తమ విజ్ఞప్తిని కెసిఆర్ పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. స్థానికత, ఫీజు రీయింబర్స్మెంట్ ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయని ఆయన అన్నారు. పదేళ్ల పాటు ఉమ్మడి అడ్మిషన్లు నిర్వహించాలనే విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం గౌరవించడం లేదని ఆయన అన్నారు. విద్యార్థులను రాజకీయాలతో ముడిపెట్టవద్దని ఆయన కెసిఆర్ను కోరారు.
కలిసి మాట్లాడుకుని సమస్యలను పరిష్కరించుకుందాం రావాలని తమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆహ్వానిస్తే కెసిఆర్ పెడచెవిన పెట్టారని ఆయన అన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారు ఎంతో మంది తెలంగాణ ప్రాంత అభివృద్ధికి దోహదం చేశారని ఆయన గుర్తు చేశారు. అలాంటి వారి సేవలను వినియోగించుకుని, వారి పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేమని చెప్పడం దారుణమని ఆయన అన్నారు.
ఫాస్ట్ పథకం, స్థానికత ఎలా..
తెలంగాణ ప్రభుత్వం ఫాస్ట్ విధివిధానాల ఖరారుకు వేసిన కమిటీలో ఎస్సీ, ఎస్టీ, బీసి సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి, పంచాయతీరాజ్తో పాటు గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, సాధారణ పరిపాలనా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, న్యాయశాఖ కార్యదర్శి సభ్యులుగా ఉంటారు.
ఫాస్ట్ పథకాన్ని నవంబర్ 1, 1957కు ముందు ఈ ప్రాంతంలో నివసించినవారి పిల్లలకు మాత్రమే వర్తింపజేస్తూ విధివిధానాలు రూపొందించాలని తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులో స్పష్టం చేసింది. 1957 నవంబర్ 1వ తేదీకి ముందు విద్యార్థుల తల్లిదండ్రులు లేదా తాతముత్తాతలు ఇక్కడ నివసించినట్లు రెవెన్యూ శాఖ జారీ చేసే ధ్రువపత్రం ఉన్నవారే ఈ పథకానికి అర్హులను జీవోలో చెప్పారు. ఈ విద్యా సంవత్సరం నుంచే ఫాస్ట్ పథకాన్ని అమలు చేస్తామని స్పష్టం చేసింది.