డిగ్గీది అంతా ఉత్తిదే: లగడపాటి, అధిష్టానంపై పళ్లం రాజు
హైదరాబాద్/న్యూఢిల్లీ: ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ పైన విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ శనివారం మండిపడ్డారు. విభజన గురించి డిగ్గీ చేసే వ్యాఖ్యలు నీటి మీద రాతలేనని, ఆయన పలు సందర్భాలలో విభజన గురించి అనేక విషయాలు మాట్లాడారని, వాటిలో ఏదీ నిజం కాలేదన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పక్కా సమైక్యవాది అని, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఒకప్పుడు సమైక్యవాదేనని, పరిస్థితులను బట్టి విభజనవాదిగా మారారన్నారు.
తీరు సరైంది కాదు: పళ్లం రాజు
విభజన ప్రక్రియ వేగంగా జరుగుతోందని, ఇది రాష్ట్ర ప్రయోజనాలకు మంచిది కాదని కేంద్రమంత్రి పళ్లం రాజు న్యూఢిల్లీలో అన్నారు. విభజన ప్రక్రియ సాగుతున్న తీరే సరైన విధంగా లేదన్నారు. అధిష్ఠానం ఎంత చెప్పినా విభజనను తాను అంగీకరించకలేకపోతున్నానని చెప్పారు.

ఉమ్మడి అవసరం లేదు: జెసి
విభజన అనివార్యమైతే పదేళ్లు ఉమ్మడి రాజధాని అనవసరమని అనంతపురం జిల్లా సీనియర్ కాంగ్రెసు ఎమ్మెల్యే, మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి అన్నారు. ఆధునిక టెక్నాలజీ వచ్చిందని, ఏడాదిలోగా ఎన్ని అంతస్థుల భవనాన్నైనా నిర్మించే సంస్థలు ఉన్నాయని, ఏ ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేస్తారో ముందు చెప్తే బాగుంటుందన్నారు. త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మిజోరం తప్ప మిగిలినచోట్ల బిజెపి గెలిచే అవకాశాలున్నాయన్నారు. దీంతో మూణ్ణెళ్ల ముందే ఎన్నికలు వచ్చే పరిస్థితి ఉందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పేరు చెబితే ఓటేసేవారు ఉండరన్నారు.
విభజన ఆపగలమని చెప్పలేం: శైలజానాథ్
విభజన ప్రక్రియను ఆపగలమని తాను చెప్పలేనని అయితే ఆపేందుకు మాత్రం ప్రయత్నిస్తామని మంత్రి శైలజానాథ్ అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని సీమాంధ్ర నేతలు ప్రధానికి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా శైలజానాథ్ మాట్లాడారు. తమ వినతిపత్రాన్ని జాగ్రత్తగా చదువుతాను అని ప్రధాని చెప్పారన్నారు.












Click it and Unblock the Notifications