ఎవ్వరూ తగ్గట్లేదు? ఏం చేస్తారో?
పశ్చిమగోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం నియోజకవర్గం కోసం టీడీపీ-జనసేన మధ్య ప్రతిష్టంభన
వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన పొత్తు పెట్టుకొని పోటీచేస్తాయనేది ఖాయమైంది. కాకపోతే అధికారికంగా ప్రకటించడమే తరువాయి. పొత్తులో భాగంగా జనసేనకు ఏయే సీట్లు కేటాయించాలనే విషయంలో తెలుగుదేశం పార్టీ ఒక స్పష్టతతోనే ఉంది. జనసేన కూడా తనకు బలమున్న జిల్లాల్లోనే సీట్లు కేటాయించమని కోరుతోంది. ఎట్టి పరిస్థితుల్లోను జనసేన నుంచి అసెంబ్లీకి పదుల సంఖ్యలో వెళ్లాలనేది జనసేనాని పట్టుదలగా ఉంది.

పార్టీ బలపడినట్లు తేలింది
పొత్తులో భాగంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కచ్చితంగా మూడు సీట్లు మాత్రం జనసేనకు దక్కుతాయంటున్నారు. భీమవరం, తాడేపల్లిగూడెం, నరసాపురం సీట్లు జనసేనకే ఇస్తారని, ఈ మూడు కాక మరో నియోజకవర్గాన్ని కేటాయిస్తారంటున్నారు. తాజాగా తాడేపల్లిగూడెం సీటు విషయంలో కొత్త ట్విస్ట్ వచ్చింది. ఇక్కడి నుంచి పోటీచేయడానికి సిద్ధంగా ఉండాలని పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న వలవల బాబ్జీకి అధిష్టానం సంకేతాలిచ్చింది. మూడున్నర సంవత్సరాల్లో పార్టీ బలపడినట్లు చంద్రబాబు చేయించుకున్న సర్వేలో తేలింది. బాబ్జీని ఇన్ ఛార్జిగా పెట్టిన తర్వాత పార్టీని దూకుడుగా ముందుకు తీసుకువెళ్లారనే అభిప్రాయంలో అధిష్టానం ఉంది.

నెలకొన్న ప్రతిష్టంభన
మరోవైపు జనసేన తరఫున బొలిశెట్టి శ్రీనివాస్ కూడా ఈ సీటుకోసం ప్రయత్నిస్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీకి 70వేల ఓట్లు రాగా, టీడీపీకి 54వేలు, జనసేనకు 36వేలు ఓట్లు వచ్చాయి. రెండు పార్టీలవి కలుపుకుంటే 90వేల ఓట్లవుతున్నాయి. పొత్తుందంటూ ప్రారంభంలో వచ్చిన ప్రచారం సమయంలో మాత్రం జనసేనకు కేటాయిద్దామనుకున్నప్పటికీ తర్వాత టీడీపీ వెనక్కి తగ్గింది. బాబ్జీనే పోటీకి దింపాలని చూస్తోంది. ఈ సీటు విషయంలో కొంత ప్రతిష్టంభన నెలకొన్నట్లు తెలుస్తోంది. పొత్తు పెట్టుకొని ఐక్యంగా పోటీచేయమని క్యాడర్ ఇరు పార్టీలకు చెబుతుంటే పురుట్లోనే తమకే ఆ సీటు కావాలంటూ సంధి కొడుతున్నారంటూ విమర్శలు వస్తున్నాయి. తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చంద్రబాబు, పవన్ కల్యాణ్ కే తెలియాలి.

ఎవరి చేతికి చిక్కుతుందో..
గోదావరి జిల్లాలపై చంద్రబాబునాయుడు ప్రత్యేకంగా సర్వే నిర్వహింపచేశారు. ఆ సర్వేలో పార్టీ బాగా బలపడటంతోపాటు ఓటింగ్ శాతం కూడా పెరిగిందని తేలడంతో సీట్ల ఖరారును జాగ్రత్తగా చేస్తున్నారు. కచ్చితంగా గెలుస్తారు అనుకున్న అభ్యర్థులకే సీట్లివ్వాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. అయితే తాడేపల్లి గూడెంలో పార్టీ బలం పెరగడంతో తామే పోటీచేయాలని నిర్ణయించుకుంది. అయితే పొత్తులో భాగంగా గూడెం సీటును తమకు కేటాయించమని జనసేన కోరుతోంది. చివరకు తాడేపల్లిగూడెం ఎవరిచేతికి చిక్కుతుందో చూడాలి.












Click it and Unblock the Notifications