ఆ మంత్రిపై తెలుగు తమ్ముళ్ల అసంతృప్తి: సీఎం చెంతకు పంచాయితీ..
అపాయింట్మెంట్ ఖరారు కావడంతో మాణిక్యాలరావుపై వారు సీఎంకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది.
ఏలూరు: తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో బీజేపీ-టీడీపీ మిత్రపక్షాల మధ్య విభేదాలు బయటపడుతున్నాయి. మంత్రి మాణిక్యాలరావు తమను లెక్కచేయట్లేదంటూ తాడేపల్లిగూడెం మున్సిపల్ టీడీపీ కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే తమ గోడు వినిపించేందుకు బుధవారం సాయంత్రం వారు చంద్రబాబుతో సమావేశం కానున్నారు. అపాయింట్మెంట్ ఖరారు కావడంతో మాణిక్యాలరావుపై వారు సీఎంకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది.విమానాశ్రయ భూముల క్రమబద్ధీకరణ విషయంలో మంత్రి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనేది కూడా తెలుగు తమ్ముళ్ల ఆరోపణ.
ఈ విషయాన్ని గతంలోను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా.. పట్టించుకున్న పాపాన పోలేదన్న అసంతృప్తిలో వారున్నారు. ఇప్పటికైనా ఈ విషయంలో చర్యలు తీసుకోకపోతే వారిలో అసంతృప్తి పెచ్చరిల్లడం ఖాయంగానే కనిపిస్తోంది. ఇప్పటికే ఇంటింటికి టీడీపీ కార్యక్రమానికి టీడీపీ కౌన్సిలర్లు దూరంగా ఉంటున్న పరిస్థితి. ఇలాంటి తరుణంలో చంద్రబాబు వారికి ఎలా సర్దిచెబుతారో వేచి చూడాలి.