మరోసారి భగ్గుమన్న తాడిపత్రి
తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి చేస్తున్న పాదయాత్రలో కొన్ని కరపత్రాలు కలకలం రేకెత్తించాయి.
అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే పెద్దారెడ్డి చేస్తున్న పాదయాత్రలో కొన్ని కరపత్రాలు కలకలం రేకెత్తించాయి. ఎమ్మెల్యే ప్రజలకు ఏం చేశారో చెప్పాలంటూ ఆ కరపత్రాల్లో ఉంది. దీనిపై పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను పాదయాత్ర చేసి ప్రజల్లోకి వెళుతుండటాన్ని చూసి ఓర్వలేకే ఈ పనికి పాల్పడ్డారంటూ జేసీ ప్రభాకర్ రెడ్డిపై భగ్గుమన్నారు. ఫ్యాక్షన్ గొడవలు పెట్టడానికే ఇదంతా చేస్తున్నారన్నారు.
గత నెలలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి జేసీపై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. కోర్టులో ఉన్న లారీల అక్రమ రిజిస్ట్రేషన్ల ఛార్జ్షీట్ను ప్రభాకర్ రెడ్డి మాయం చేశాడని ఆరోపించారు. దీనికి రూ.40 లక్షలు ఖర్చు పెట్టారన్నారు. ప్రభాకర్ రెడ్డికి నేరాలు చేయడం.. అధికారులపై వేయడం అలవాటేనన్నారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలకు స్పందించిన జేసీ ప్రభాకర్ రెడ్డి ఛార్జీషీట్ మాయమైన విషయం పెద్దారెడ్డికి ఎలా తెలుసని ప్రశ్నించారు. ఈ విషయంఎలా బయటకు వచ్చిందో బయట పెట్టాలని డిమాండ్ చేశారు. న్యాయవ్యవస్థను కించపరిచేలా మాట్లాడిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని జేసీ డిమాండ్ చేశారు.
గత నెలలో తాడిపత్రిలో సీబీఐ సోదాలు నిర్వహించింది. బీఎస్ 3 వాహనాలను బీఎస్ 4 పేరిట అక్రమంగా విక్రయించారన్న ఆరోపణలపై ఢిల్లీ నుంచి సీబీఐ అధికారులు దర్యాప్తు కోసం వచ్చారు. జఠాదర ఇండస్ట్రీస్ చవ్వా గోపాల్ రెడ్డి ఇంట్లో తనిఖీలు నిర్వహించడంతోపాటు కీలకమైన పత్రాల కోసం వెతికినట్లు తెలుస్తోంది. జేసీ ప్రభాకర్ రెడ్డి ఈడీ అధికారుల ఎదుట ఇప్పటికే రెండుసార్లు హాజరైన సంగతి తెలిసిందే. ఈ కేసులో జేసీ ఆస్తులను అటాచ్ చేస్తూ ఈడీ ఆదేశాలు కూడా జారీచేసింది. బీఎస్ 3 వాహనాలను తుక్కు కింద కొని బీఎస్ 4 గా అక్రమ రిజిస్ట్రేషన్లు చేసినట్లు జేసీ ట్రావెల్స్ పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. కొన్ని వాహనాలు గోపాల్ రెడ్డిపేరుమీద కూడా ఉన్నారు. జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో ఇప్పటికే రూ.22కోట్ల ఆస్తులను ఈడీ అధికారులు అటాచ్ చేశారు.